‘ఏదో సాధించాలని ఊరిని వదిలి సిటీలకు వస్తుంటాం. అలా వచ్చి కొన్ని కోల్పోతాం. కొన్ని సాధిస్తాం. చివరకు లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా అనేది చూసుకుంటాం. ఇందులో హీరో ఒక లక్ష్యంతో సిటీకి వస్తాడు. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వేరే సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఆ సమస్యల్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. దాంతో లక్ష్యం పక్కదారి పడుతుంది.
చూస్తున్న ఆడియన్స్కి కూడా లక్ష్యాన్ని పక్కన పడేశాడే అనిపిస్తుంది.. చివరకు తను అనుకున్నది సాధించాడా? లేదా? అనేదే మా ‘భజే వాయువేగం’ ’ అంటున్నారు దర్శకుడు ప్రశాంత్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణసంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పిస్తున్నది. ఈ నెల 31న సినిమా విడుదల కానున్న సందర్భంగా దర్శకుడు ప్రశాంత్రెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ‘ కథ ప్రకారం ప్రథమార్ధం పర్ఫార్మర్ కావాలి. ద్వితీయార్ధం హీరోయిజం ఎలివేట్ కావాలి. అందుకే కార్తీకేయను బెస్ట్ ఆప్షన్ అనుకున్నాను.
తను చక్కగా నటిస్తాడు. అద్భుతంగా హీరోయిజాన్ని పండిస్తాడు. అనుకున్నట్టే చేశాడు కూడా. ఇందులో హీరోయిన్గా ఐశ్వర్య మీనన్ కూడా పర్ఫెక్ట్ ఆప్షన్. సంప్రదాయబద్ధమైన అమ్మాయిగా తను కనిపిస్తుంది.’ అని తెలిపారు ప్రశాంత్రెడ్డి. ఈ సినిమాట్రైలర్కి మంచి స్పందన వస్తున్నదని, సినిమా ఊహలకు అందనంత గొప్పగా ఉంటుందని, ఈ సినిమాకు ‘స్పీడ్’ అనే టైటిల్ అనుకున్నామని, అయితే తెలుగులో ఉంటే బావుంటుందని అఖిల్తో యూవీలో సినిమా చేస్తున్న డైరెక్టర్ అనిల్ ‘భజే వాయువేగం’ పేరుని సూచించారని, పేరుకు తగ్గట్టే సినిమా వేగంగా ఉంటుందని ప్రశాంత్రెడ్డి చెప్పారు. అత్యన్నత సాంకేతిక విలువలతో సినిమా ఉంటుందని, రాజమౌళి ప్రేరణతో ఇండస్ట్రీకి వచ్చిన తనకు మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవడమే లక్ష్యమని ప్రశాంత్రెడ్డి తెలిపారు.