సందేశాన్ని కమర్షియల్ కలిపి తెలుగు తెరకు కొత్త హీరోయిజాన్ని అందించారు దర్శకుడు కొరటాల శివ. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ వంటి చిత్రాల్లో ఆయన మంచితో పాటు ప్రేక్షకులు కోరుకునే పంచ్ కూడా చూపించారు. ఈ ప్రత్యేకతే ఆయన్ను అగ్ర హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని అందిస్తున్నది. ఈ క్రమంలో చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా ఆయన తెరకెక్కించిన సినిమా ‘ఆచార్య’. ఈ నెల 29న విడుదలవుతున్నది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ సినిమాకు పనిచేసిన అనుభవాలను తెలిపారు.
చిరంజీవితో సినిమా చేయాలనే ఆలోచన ఎప్పుడు కలిగింది?
పాండమిక్ ముందు చరణ్ తో ఒక సినిమా అది కుదరకపోవడంతో చిరంజీవి గారి సినిమా అవకాశం వచ్చింది. స్టార్గా చిరంజీవి ఇమేజ్ తెలుసు కాబట్టి ఆయన స్థాయికి తగినట్లే భారీగా సినిమాను రూపొందించాం. చిరంజీవితో ప్రయోగాత్మక సినిమా చేయాలనే ఆలోచన నాకెప్పుడూ లేదు. ఆయన లాంటి స్టార్కు పక్కా కమర్షియల్ సినిమా రూపొందించడమే సరైనది.
ధర్మం, దేవాలయం అనే కాన్సెప్ట్తో కథ రాయడం కష్టంగా అనిపించిందా?
ఒక స్టార్ హీరోకు కథ రాయడం రచయితగా, దర్శకుడిగా సులువు. కొత్త వాళ్లకు అంత స్వేచ్ఛ తీసుకోలేం. ప్రతి హీరో సినిమాలో ధర్మం కోసమే పోరాడుతాడు. ఇందులో ఆ పదాన్ని కాస్త గట్టిగా చెప్పాం అంతే. సినిమాలో ఎలాంటి సందేశాలు ఇవ్వలేదు. కమర్షియల్ కథను ధర్మం అనే ఒక కొత్త నేపథ్యంతో చూపిస్తున్నాం.
చిరంజీవి, రామ్ చరణ్ పాత్రలు ఎలా ఉంటాయి?
చిరంజీవి, రామ్ చరణ్ భిన్నమైన క్యారెక్టర్స్ చేశారు. చరణ్ గురుకులంలో చదువుకునే విద్యార్థి సిద్ధ పాత్రలో కనిపిస్తారు. ఆసక్తి కలిగించే వ్యక్తిత్వం అతనిది. ఏ సమస్య ఎదురైనా ఆవేశపడడు. సహజంగా స్పందిస్తాడు. రేపు థియేటర్లో సిద్ధను చూస్తే ప్రేక్షకులు మేమూ అలా ఉండాలని కోరుకుంటారు. ఆచార్య స్వతహాగా దూకుడు స్వభావి. అందుకు అతని నక్సలిజం నేపథ్యం కారణం. సమస్యలపై ఇద్దరు పోరాడే తీరు వేరు కానీ వాళ్ల లక్ష్యం ఒక్కటే.
అధర్మంపై ధర్మం గెలవడం సినిమాల్లో చూసేదే. ఈ కథలో మీకు కొత్తగా అనిపించింది ఏంటి?
రెండు వేర్వేరు నేపథ్యాలు, స్వభావాలు ఉన్న వ్యక్తులు ఒక సమస్యపై పోరాటం చేసే తీరు కొత్తగా ఉంటుంది. గురుకులంలో ఉండే విద్యార్థి అడవులకు వెళ్తాడు, అడవుల్లో ఉండే ఆచార్య పాదఘట్టంకు వస్తాడు. ఇలా కథలోని రెండు భిన్నమైన స్వభావాలు ఉన్న పాత్రలు ఒకే సమస్యపై పోరాడే తీరు థ్రిల్లింగ్గా ఉంటుంది.
రామ్ చరణ్ ఈ సినిమాలోకి రావడంలో ఎదురైన సమస్య ?
చరణ్తో ఈ సినిమాకు వర్క్ చేస్తాననుకోలేదు. కథ రాయడం మొదలుపెట్టాక ఓ పెద్ద పాత్ర అందులోకి వచ్చింది. ఆ క్యారెక్టర్ను రామ్ చరణ్ చేస్తేనే బాగుంటుంది కానీ ఆయనకు ఆర్ఆర్ఆర్ డేట్స్ వల్ల కుదరలేదు. మాకు ఎదురైన క్లిష్టమైన పరిస్థితి అది. రాజమౌళి సహకారంతో చరణ్ ఆచార్య సెట్లో అడుగుపెట్టారు
నక్సలిజం నేపథ్యంతో సినిమా రూపొందించాలంటే చాలా మంది భయపడతారు. మీరెలా చేయగలిగారు?
ఈ సినిమాలో ఆచార్య పాత్ర వరకు మాత్రమే నక్సలిజం నేపథ్యం తీసుకున్నాం. కానీ వాళ్ల సిద్ధాంతాలు, పోరాటాల గురించి లోతుగా వెళ్లి చర్చించలేదు. నక్సలిజం నేపథ్యమున్న పాత్ర సమస్య వస్తే ఎలా స్పందిస్తుంది అనేది చూపించాం. ఈ స్వభావాన్ని హీరో పాత్రకు ఆపాదిస్తూ వెళ్లాం. నాకు నక్సలిజం సాహిత్యం తెలుసు, ఆ సినిమాలు చూశా.
మిర్చి సినిమాలాంటి యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో ఉంటాయా?
ఇందులో అలాంటి యాక్షన్ బ్లాక్స్ చాలా ఉంటాయి. అంత ఎంగేజింగ్గా, ఇంట్రెస్టింగ్గా వెళ్లే పోరాట సన్నివేశాలు చూస్తారు.
ఈ సినిమాకు నిజాయితీ అనే పదాన్ని మీరు ఎక్కువగా వాడారెందుకు?
నా సినిమాల్లో హీరోలు బీస్ట్ మోడ్లో ఉన్నా వాళ్లు నిజాయితీగానే ప్రవర్తిస్తారు. మిర్చిలో ప్రభాస్ వాళ్ల నాన్నను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోడు. ఆ తర్వాత నాన్న తననుంచి ఏం కోరుకుంటున్నాడో అలా మారిపోతాడు. అదే నిజాయితీ.
ఈ చిత్రంలో మీ తరహా మంచిని చెప్పే ప్రయత్నం ఎక్కువ చేశారా లేక చిరంజీవి ఇమేజ్ కోసం కమర్షియాలిటీ పెంచారా?
చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ పెద్ద స్టార్స్. కమర్షియాలిటీ సహజంగానే పెరుగుతుంది. వాళ్లు సినిమాలో మాట్లాడినప్పుడు పదునైన మాటలే వస్తుంటాయి. ఆకట్టుకునే భావోద్వేగాలే పలుకుతాయి. ఆ మాటలు, భావోద్వేగాల నుంచి ప్రేక్షకులు కోరుకున్న అనుభూతి వస్తుంది.
టికెట్ రేట్ల పెంపు మొదటివారం సినిమా చూసేవాళ్లపై ప్రభావం చూపిస్తుంది కదా?
పాండమిక్ టైమ్లో ప్రొడ్యూసర్స్ అంతా తాము పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అనుకునే స్థితిలో ఉన్నారు. వీలైనంత ప్రేక్షకుల నుంచి లూఠీ చేద్దాం అనుకోవడం లేదు. కొంతైనా కలిసొస్తుందని టికెట్ రేట్లు పెంచారు. నాలుగేళ్లు పనిచేసి జేబుల్లోంచి డబ్బులు పెట్టాలా అంటే ఎలా ఉంటుంది.
కేజీఎఫ్ తర్వాత ప్రేక్షకులు సినిమాలను ఎంచుకునే తీరుపై మార్పు వచ్చిందనుకోవచ్చా?
ప్రేక్షకులు శుక్రవారం సినిమాకు వెళ్లాలంటే గురువారం మాత్రమే ఆలోచిస్తారు ఏ సినిమా చూద్దామని. ఈ ఏడాది అంతా ఇలాంటి సినిమాలే చూడాలని పెట్టుకోరు అనేది నా అభిప్రాయం.
మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి?
స్వామి వివేకానంద బయోపిక్ చేయాలని ఉంది. భారతదేశాన్ని అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి మరొకరు లేరు. సోషల్ మీడియా లేని రోజుల్లో ఆయన ప్రసంగాలు ప్రపంచం తెలుసుకుంది. ఆ సినిమా చేస్తే భారీ స్థాయిలో రూపొందించాలని ఉంది.
ఇద్దరు స్టార్స్తో సినిమా తెరకెక్కించడంలో ఒత్తిడికి లోనయ్యారా?
ఇద్దరు హీరోలను పెట్టి సినిమా చేస్తున్నామనే ఒత్తిడిని చిరంజీవి, రామ్ చరణ్ నా నుంచి తీసేశారు. ఇద్దరూ తమ పాత్రల పట్ల నిజాయితీగా వ్యవహరించి నటించారు. నేను ఎక్కువ, తక్కువ అనేవి పెట్టుకోలేదు. సిద్ధ, ఆచార్య ఇలా ఉంటారని చెబితే ఆ పాత్రోచితంగా నటించారు. ఇద్దరూ ఆ లెక్కలు వేసుకోలేదు. వాళ్ల కాంబినేషన్ సీన్స్ తెరకెక్కిస్తున్నప్పుడు ఇద్దరి టైమింగ్ చూసి ఫ్లోలో ఉన్నారు మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు అనిపించింది. పాటల్లోనూ అదే మ్యాజిక్ జరిగింది.