‘నా బాల్యంలో విన్న కథలు, చూసిన పరిస్థితులు, చదివిన చరిత్ర నుంచి ‘రుద్రంగి’కథను రాసుకున్నాను’ అంటున్నారు దర్శకుడు అజయ్ సామ్రాట్. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రంగి’. జగపతిబాబు, మమత మోహన్దాస్, విమలరామన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శాసనసభ్యులు రసమయి బాలకిషన్ నిర్మించారు.
చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అజయ్సామ్రాట్ మీడియాతో ముచ్చటించాడు. ఆయన మాట్లాడుతూ ‘రుద్రంగి’ తెలంగాణ నేపథ్య కథ.ఇందులో చూపించిన సమస్యలు ఎక్కడ వుంటే అక్కడి నుంచి ఈ కథ తీసుకున్నట్లే అవుతుంది. ఆ సమస్యలు ఎక్కడ వచ్చినా ఇలాంటి పోరాటాలే జరుగుతాయి.
ఎమోషనల్ ఫ్యామిలీ, సోషల్డ్రామాగా చిత్రాన్ని తెరకెక్కించాను. అరవై రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశాం. పెట్టిన ఖర్చు కంటే విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. తప్పకుండా మా చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. ఇంతకు ముందు నేను బాహుబలి, రాజన్న చిత్రాలకు డైలాగ్ రైటర్గా పనిచేశాను. నా దగ్గర మరికొన్ని కథలు వున్నాయి. ‘రుద్రంగి’ విడుదల తరువాత నా తదుపరి సినిమా విశేషాలను తెలియజేస్తాను’ అన్నారు.