ఒకప్పుడు సినిమాలోని పాటలను ప్రొఫెషనల్ సింగర్స్ మాత్రమే పాడేవారు. ఇప్పుడు అలా కాదు హీరోలు, హీరోయిన్స్ కూడా పాడుతున్నారు. సంగీత దర్శకులు కొత్త ప్రయత్నాలు చేస్తూ శ్రోతలను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, రవితేజ ఇలా పలువురు హీరోలు పాటలు పాడగా, శృతి హాసన్,రష్మిక వంటి వారు కూడా గొంతు సవరించుకున్నారు. ఇక ఇప్పుడు నిర్మాత దిల్ రాజు కూడా గాయకుడిగా మారాడు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ లో మంచి గాయకుడు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. అయన బాత్రూం సింగర్ కాదు. స్టేజి మీద కూడా పర్ఫర్మ్ చేసేంత సింగింగ్ టాలెంట్ ఉంది. కరీంనగర్ లో ‘అమిగోస్ డ్రైవ్ ఇన్’ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు పాటలు పాడడం విశేషం.
గెస్ట్ గా వెళ్లిన దిల్ రాజుని అక్కడ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న బ్యాండ్ స్టేజి పైకి ఆహ్వానించింది. తమతో కలిసి పాడాల్సిందిగా కోరారు ఆ బ్యాండ్ సింగర్స్. మొహమాటంగానే మైక్ అందుకున్న దిల్ రాజ్ పాట మొదలెట్టారు. మొదట్లో బెరుకుగా పాడిన ఆయన ఆ తర్వాత లీనమయ్యి ఎంజాయ్ చేస్తూ అదరకొట్టారు.“హలో గురు ప్రేమ కోసమే జీవితం” అంటూ ‘నిర్ణయం’ సినిమాలోని పాటను దిల్ రాజు స్టేజిపై పాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూస్తే సినిమాలో కూడా ఛాన్స్ లు ఇస్తారేమో అని అంటున్నారు.