Dil Raju | లక్ష్ చదలవాడ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ధీర’. తిరుమల తిరుపతి వెంకటేశ్వర పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్రాజు, గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు చెందిన బిగ్ టికెట్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘శ్రీనివాస్ గారు ఎంతో మంది చిన్న నిర్మాతలకు సాయం చేశారు. ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్లోనూ నాకు సహాయం చేశారు. ‘ధీర’ టీజర్ బాగుంది’ అన్నారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘తండ్రిగా లక్ష్ను చూసి గర్విస్తుంటాను. నేను తీసిన ‘రికార్డ్ బ్రేక్’ అనే గ్రాఫిక్స్ సినిమా మార్చిలో రాబోతోంది. సునీల్కుమార్రెడ్డితో హిందీలోనూ ఓ సినిమా చేస్తున్నాను. కేఎన్ నాగేశ్వరరావు ‘నా కనురెప్పవు నువ్వేరా’ కూడా రెడీగా ఉంది. మా ప్రొడక్షన్స్లో 16 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఇండస్ట్రీని ఏకతాటిపైకి తీసుకురావాలన్న ఇరవై ఏళ్ల నా కలను దిల్రాజు గారు నెరవేర్చారు’ అన్నారు. హీరో లక్ష్ మాట్లాడుతూ ‘సినిమా కథ గురించి ఇప్పుడేం చెప్పలేం. పక్కనోడిని పట్టించుకోని ఓ వ్యక్తికి ఓ మిషన్ అప్పగిస్తే ఎలా ఉంటుందో ‘ధీర’లో చూడొచ్చు. యాక్షన్ మూవీగా మెప్పిస్తుంది’ అని చెప్పారు. ‘ఇంత పెద్ద బ్యానర్ నుంచి దర్శకుడిగా పరిచయం అవుతాననుకోలేదు. ఒళ్లు దగ్గర పెట్టుకొని ‘ధీర’ కథ రాసుకున్నాను’ అని చిత్ర దర్శకుడు విక్రాంత్ శ్రీనివాస్ తెలిపారు.