నేహా ప్రధాన పాత్రలో నటించిన బాలల సినిమా ‘లిల్లీ’. వేదాంత్ వర్మ, ప్రణితా రెడ్డి, రాజ్వీర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని గోపురం స్టూడియోస్ పతాకంపై కె బాబు రెడ్డి, జి.సతీష్ కుమార్ నిర్మించారు. శివమ్ దర్శకుడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….‘లిటిల్ సోల్జర్స్’, ‘అంజలి’ వంటి చిన్న పిల్లల సినిమాలు నాకు బాగా ఇష్టం. డిస్ట్రిబ్యూటర్గా ‘సిసీంద్రి’ చిత్రాన్ని పంపిణీ చేశాను. మంచి కాన్సెప్ట్తో రూపొందిస్తే పిల్లల సినిమాలు ఆదరణ పొందుతాయి. ఈ చిత్రంతో శివమ్ అలాంటి ప్రయత్నమే చేశారనిపిస్తున్నది. ట్రైలర్ ఆకట్టుకుంది’ అన్నారు. దర్శకుడు శివమ్ మాట్లాడుతూ…‘భావోద్వేగాలతో ఆకట్టుకునే చిత్రమిది. ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ సినిమా చూపించాలనుకునేంత బాగుంటుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.