సమంత కొన్నాళ్లు నటనకు బ్రేక్ ఇచ్చిందా? సోషల్మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులు అవుననే చెబుతున్నాయి. ఇది ఓ విధంగా సామ్ అభిమానులకు మింగుడుపడని విషయమే. వైవాహిక జీవితం అర్ధాంతరంగా ముగియడం, దానికితోడు మయోసైటిస్. ఈ కారణాలు ఓ విధంగా సమంతను కొంత కృంగదీశాయనే చెప్పాలి. కానీ బాధలన్నింటినీ దిగమింగి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తుంది సమంత. ఇటీవలే ఆమె కథానాయికగా ‘ఖుషి’ సినిమా విడుదలైంది. అందులో ఆరాధ్యగా అలరించింది సమంత. మరోవైపు ఆమె చేసిన వెబ్సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వర్షెన్ కూడా షూటింగ్ పూర్తయింది. దాంతో ఇక నటనకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నది సమంత. ప్రస్తుతం తను ట్రావెలింగ్పై దృష్టిపెట్టింది. చిన్నప్పట్నుంచీ తను చూడాలనుకునే ప్రదేశాలన్నింటినీ సరదాగా చుట్టి వచ్చే పనిలోఉంది.
ఇందులో భాగంగానే ఆస్ట్రియాలోని స్టాల్జ్బర్గ్ వెళ్లింది సమంత. అక్కడ ఫొటోలు దిగి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. “ ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ సినిమా నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మనసు బాగుండకపోతే ఈ సినిమానే చూసేదాన్ని. ఇప్పటికీ అదే అలవాటు. ఆ సినిమాలో లొకేషన్లు నాకు కళ్లు మూసుకుంటే కనిపిస్తుంటాయి. అందుకే.. ఆస్ట్రియాలోని స్టాల్జ్బర్గ్ వచ్చాను. ఇక్కడే ఆ సినిమా తీశారు. ఇప్పుడు ఆ లొకేషన్లో నేనూ ఉన్నాను. ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను” అంటూ సంతోషం వ్యక్తం చేసింది సమంత.