తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మాటల రచయిత శ్రీరామకృష్ణ (Sri Ramakrishna) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఆయన మొత్తం 300 కు పైగా సినిమాలకు అనువాద రచయితగా పనిచేసారు. వాటిల్లో ముంబై, జెంటిల్మెన్, చంద్రముఖి వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. వయోసంబంధిత సమస్యలతో సినీపరిశ్రమకు దూరంగా ఉంటున్న ఆయన చివరిసారిగా రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమాకు డైలాగ్స్ రాశారు. రామకృష్ణ మృతిపట్ల సింగర్ మనోతోపాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
రామకృష్ణ స్వస్థలం తెనాలి. అయితే 50 ఏండ్ల క్రితమే చెన్నైలో స్థిరపడిపోయారు. ఆయనకు భార్య స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. అనువాద రచయితగానే కాకుండా బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ లాంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకులు మణిరత్నం, శంకర్ అన్ని సినిమాలకి ఆయనే మాటలు రాసేవారు. గాయకుడు మనోను రజనీకాంత్కు పరిచయం చేశారు. సూపర్ స్టార్ సినిమాలకు మనో తెలుగు డబ్బింగ్ చెబుతున్న విషయం తెలిసిందే.