Dhurandhar | రణ్వీర్ సింగ్ హీరోగా, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. జియో స్టూడియోస్ సమర్పణలో B62 స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా సుమారు రూ.280 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కగా, విడుదలైన నాటి నుంచి అంచనాలను మించి వసూళ్లు సాధిస్తూ బాలీవుడ్ రికార్డులను తిరగరాస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం 17వ రోజు ఆదివారం ఇండియాలో రూ.38.5 కోట్ల వసూళ్లు రాబట్టి మరోసారి తన సత్తా చాటింది. దీంతో మొత్తం ఇండియా కలెక్షన్లు రూ.566.75 కోట్లకు చేరగా, ప్రపంచవ్యాప్తంగా రూ.852.75 కోట్ల గ్రాస్ను సాధించి ‘యానిమల్’ మూవీ రికార్డును బ్రేక్ చేసింది.
ముఖ్యంగా అదే రోజు అవతార్ 3 ఇండియాలో రూ.25 కోట్లు మాత్రమే వసూలు చేయగా, ‘ధురంధర్’ దాన్ని అధిగమించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది భారీ హిట్లుగా నిలిచిన ‘ఛావా’, ‘కాంతారా చాప్టర్ 1’ వంటి చిత్రాల రికార్డులను కూడా ఒక్కొక్కటిగా బద్దలు కొడుతూ, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘ధురంధర్’ నిలిచింది. సినిమాలో రణ్వీర్ సింగ్తో పాటు అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించడంతో కథకు మరింత బలం చేకూరింది.
శక్తివంతమైన కథనం, ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, ఆదిత్య ధర్ మార్క్ దర్శకత్వం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో కలెక్షన్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే ‘ధురంధర్’ త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఈ సినిమాపై అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించడం, మరోవైపు మౌత్ టాక్తో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.