Dhurandhar 2 Advance Booking | రణ్వీర్ సింగ్ అభిమానులకు మరియు సినీ ప్రియులకు గుడ్ న్యూస్ అందింది. రణ్వీర్ సింగ్ నటిస్తున్న భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ మార్చి 19న విడుదల కాబోతుండగా.. విడుదల తేదీ కంటే పది రోజుల ముందే ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ను ప్రారంభించారు మేకర్స్. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా వంటి విదేశీ మార్కెట్లలో బుకింగ్స్ ఓపెన్ అయి రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్నాయి.
మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి మార్చి 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచే భారీ స్థాయిలో పెయిడ్ ప్రివ్యూలను ప్లాన్ చేశారు. మొదటి భాగం హిందీలో భారీ విజయం సాధించగా, ఈ సీక్వెల్ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. సుమారు 3 గంటల 40 నిమిషాల సుదీర్ఘ రన్ టైమ్తో వస్తున్న ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో, రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా పోటీగా రావాల్సిన యష్ ‘టాక్సిక్’ సినిమా జూన్ నెలకు వాయిదా పడటంతో, ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సోలోగా సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.