‘చిన్నప్పట్నుంచీ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. మాకు కొన్ని థియేటర్లున్నాయి. వాటిల్లో పనిచేశా. రోజు సినిమాలు చూసేవాడ్ని. ఇంజనీరింగ్ అయ్యాక బిజినెస్ స్టార్ట్ చేశాం. లాభాలు చూశా. సత్యానంద్గారి ఇనిస్టిట్యూట్లో చేరి యాక్టింగ్ శిక్షణ తీసుకున్నా. ‘డ్రింకర్సాయి’ హీరోగా నా తొలి సినిమా. కానీ విడుదలైంది మాత్రం ‘సింధూరం’. రీసెంట్గా ‘డ్రింకర్ సాయి’ మా నాన్న చూశారు. ఆయన ఫస్ట్టైమ్ నన్ను మెచ్చుకున్నారు. ‘నీకు ఇదే కరెక్ట్’ అని ఆశీర్వదించారు.
అదే నా విజయం’ అని హీరో ధర్మ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. ఐశ్వర్యశర్మ కథానాయిక. కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హీరో ధర్మ విలేకరులతో ముచ్చటించారు. ‘వాస్తవంగా ఓ వ్యక్తి జీవితంలో జరిగిన కథ ఇది. నేరుగా వెళ్లి ఆ వ్యక్తిని కలిశాను.
అతని లైఫ్లో జరిగిన సంఘటనలు తెలుసుకున్నాను. అంతేకాదు, ఆ క్యారెక్టర్ చేసేందుకు చాలామంది డ్రింకర్స్ని అబ్జర్వ్ చేశాను. నాకు డ్రింక్ అలవాటు లేదు. అయినా బార్లకు వెళ్లి తాగిన వాళ్లను, తాగుతున్న వాళ్లను అబ్జర్వ్ చేశా. ఎంతో కష్టపడి ఈ పాత్ర చేశా. నేనే కాదు, ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేశారు.’ అని తెలిపారు.