తమిళ అగ్రహీరో ధనుష్కు మద్రాస్ హైకోర్ట్ సమన్లు జారీ చేసింది. మధురైకు చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ కుమారుడని, చిన్నతనంలోనే ఇళ్లు విడిచి వెళ్లాడని కొన్నేళ్ల క్రితం మధురై కోర్టులో కేసు వేశారు. అక్కడ కేసును కొట్టివేయడంతో దంపతులిద్దరూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం కొన్నేళ్లుగా కోర్టులో పెండింగ్లో ఉంది. అయితే తల్లిదండ్రులెవరో నిర్దారించే టెస్ట్కు సంబంధించిన పత్రాలను ధనుష్ ఫోర్జరీ చేశాడని..దీనిపై పోలీస్ విచారణ జరపాలని ఇటీవలే కదిరేషన్ దంపతులు మద్రాస్ కోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం ధనుష్కు సమన్లు జారీ చేసింది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వివాదం ధనుష్కు తలనొప్పిగా మారింది. ఓ వైపు కేసు నడుస్తూ ఉండగానే తమకు ధనుష్ నెలకు అరవై వేల రూపాయల పరిహారం చెల్లించాలని కదిరేషన్ కోరుతున్నాడు. కదిరేషన్ దంపతులు కేసు విషయంలో పట్టుదలతో ఉండటం ధనుష్కు చికాకులు తెప్పిస్తున్నది.