‘ధనుష్తో పదకొండు సంవత్సరాల తర్వాత సినిమా చేస్తున్నా. తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’ అన్నారు సెల్వరాఘవన్. ఆయన దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘నానే వరునెన్’ చిత్రం తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో ఈ నెల 29న విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగు లో రిలీజ్ చేస్తున్నది. ఈ సందర్భంగా దర్శకుడు సెల్వ రాఘవన్ మాట్లాడుతూ ‘ధనుష్తో కలిసి ఈ కథను సిద్ధం చేశా. తను మంచి రైటర్. ఇదివరకే ‘వి.ఐ.పి’ వంటి సినిమాకు రచన చేశాడు.
ఈ సినిమాలో ధనుష్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడు. రెండు పాత్రలు భిన్న ఎమోషన్స్తో సాగుతాయి. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ప్రతి సన్నివేశం ఆసక్తిని పంచుతుంది. కథ, కథనాలు నవ్యరీతిలో సాగుతాయి. తమ్ముడు ధనుష్తో కలిసి నేను సినిమా చేయాలన్నది మా అమ్మ కోరిక. ఆమె సలహా మేరకు ఈ సినిమా మొదలుపెట్టాం. గీతా ఆర్ట్స్ లాంటి గొప్ప నిర్మాణ సంస్థ ఈ సినిమాను విడుదల చేయడం సంతోషంగా ఉంది’ అన్నారు.