ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రమిదే కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి ఆసక్తి పెరిగింది. తాజా షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించినట్లు తెలిసింది. ఎన్టీఆర్-సైఫ్అలీఖాన్ మధ్య వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్ రొమాంచితంగా ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా వుండగా ఈ సినిమా కథాంశం గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది.
సముద్రం నేపథ్యంలో వచ్చే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ కథకు ఆయువుపట్టులా ఉంటుందని సమాచారం. విజువల్గా కూడా ఈ ఎపిసోడ్ను అద్భుతంగా డిజైన్ చేయబోతున్నారని అంటున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం..అక్కడ తన మనుషులను రక్షించుకోవడానికి ఓ వీరుడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.