ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘దేవర’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. తాజా షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది. రెండు వారాల పాటు ఏకధాటిగా జరుపనున్న ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. కథానాయిక జాన్వీకపూర్ సైతం ఈ షెడ్యూల్లో భాగం కానుందని తెలిసింది. ఇటీవలే ఈ చిత్రం గోవాలో ఓ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. అక్కడ సముద్రపు నేపథ్యంలో పోరాట ఘట్టాలను తెరకెక్కించారు. విస్మరణకు గురైన తీర ప్రాంతపు నేపథ్య కథాంశంతో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.