Film Industry AP | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కొత్త చిత్రాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సినిమాలు హాళ్ల బంద్ ప్రకటనలు, తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలు, తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు… ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే తన సొంత చిత్రం ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని, ఇందులో తనమన బేధాలు పాటించవద్దని స్పష్టం చేశారు.
టికెట్ ధరలు, థియేటర్లలో పానీయాల ధరలపై దృష్టి
ప్రేక్షకులు సినిమా హాల్ వరకు రావాలంటే, టికెట్ ధర కంటే థియేటర్లలో పాప్కార్న్, శీతల పానీయాలు, మంచి నీళ్ల సీసాల ధరలు భారీగా ఉండటంపై ఈ సందర్భంగా చర్చించారు. వాటి ధరలు ఎంత, ఎంతకు అమ్ముతున్నారు, వాటిలో నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లలో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలో గుత్తాధిపత్యం నడుస్తోందని ప్రభుత్వ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుందని, ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానుల కనీస బాధ్యతలని, వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకోవాలని పేర్కొన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం, ‘ఆ నలుగురు’ ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైనా చర్చించారు.
ఈ ప్రకటన వెనుక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనుకగల కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దని స్పష్టంగా చెప్పారు.
నిర్మాతలను కావచ్చు, నటులను కావచ్చు, దర్శకులను కావచ్చు… బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకొని వ్యాపారాలు సాగించాలనుకొనే అనారోగ్యకర వాతావరణానికి తావు ఇవ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకువస్తుందని విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియజేయాలన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలచిన కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.