బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్బచ్చన్ మనవరాలు, అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్ ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యంపై తప్పుడు వార్తల్ని ప్రసారం చేసిన యూట్యూబ్ చానళ్లపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం ఆ కంటెంట్ను తొలగించాలని వివిధ యూట్యూబ్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తున్న చానల్స్పై చర్యలు తీసుకోవాలంటూ అమితాబ్బచ్చన్ కుటుంబ సభ్యులు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంలో న్యాయమూర్తి జస్టిస్ సి హరిశంకర్ ఆడబిడ్డల వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాధారణ కుటుంబంలోని చిన్నారులు మొదలుకొని సెలబ్రిటీల బిడ్డల వరకు ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలన్నారు.
వారి మానసిక, శారీరక ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు రాయడం, ప్రసారం చేయడం చట్టపరంగా క్షమించరాని నేరమని తెలిపారు. అమితాబ్బచ్చన్ తరపున న్యాయవాది సమర్పించిన సాక్ష్యాలను పరిశీంచిన కోర్టు గూగుల్ సంస్థతో పాటు పలు యూట్యూబ్ చానల్స్కు సమన్లు జారీ చేసింది. కంటెంట్ను పొందుపరిచే విషయంలో గూగుల్ భారతీయ చట్టాలను అతిక్రమించకూడదని హెచ్చరించింది. అసత్య కథనాలను ప్రసారం చేసిన వివిధ యూట్యూబ్ చానల్స్ను యాక్సెస్ చేయకుండా నిరోధించాలని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.