సినిమా షూటింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోవాలంటే అనేక విషయాల్లో సమన్వయం అవసరమని చెప్పింది అగ్ర కథానాయిక దీపికాపడుకోన్. ముఖ్యంగా మనతో పనిచేసే బృందం ఎలాంటిదన్నది ప్రాధాన్యతాంశమని పేర్కొంది. కథ, దర్శకుడి మీద నమ్మకంతో సినిమా ఒప్పుకోగానే సరిపోదని, షూటింగ్ పూర్తయ్యేవరకు ఎవరితో ప్రయాణం సాగిస్తున్నామనేది కూడా చాలా ప్రధానమని దీపికాపడుకోన్ చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘కథ నచ్చితేనే తొలుత సినిమాకు అంగీకరిస్తాం. ఆ తర్వాత దర్శకుడి ప్రతిభ, నిర్మాణ సంస్థల విలువ గురించి ఆలోచిస్తాం. నా దృష్టిలో వీటితో పాటు షూటింగ్ సందర్భంగా మన వెన్నంటి వుండే టీమ్ ఎలాంటిదో విశ్లేషించుకోవాలి. సినిమా చిత్రీకరణలో ఒక్కోసారి అనుకోని అవాంతరాలు ఎదురవుతుంటాయి. ఒత్తిడి వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. అలాంటి క్లిష్ట సమయాల్లో అర్థం చేసుకునే బృందం పక్కన ఉంటే అన్ని సజావుగా జరిగిపోతాయి. సరైన టీమ్ లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా నిరుత్సాహ పూరిత వాతావరణంలో పనిచేస్తున్నామనే భావన కలుగుతుంది. అందుకే నాతో కలిసి పనిచేసే బృందం విషయంలో నేను జాగ్రత్తగా ఉంటా’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్లో షారుఖ్ఖాన్ సరసన ‘పఠాన్’ సినిమాలో నటిస్తోంది.