అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో భారతీయ సినిమాకు ఇప్పుడున్నంత ప్రాధాన్యత ఒకప్పుడు ఉండేది కాదని, దేశీయ చిత్ర పరిశ్రమ ఒక్కటిగా సాధించిన విజయమిదని అంటున్నది బాలీవుడ్ అందాల తార దీపికా పడుకోన్. ఇండియన్ పెవిలియన్ తరపున కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సందడి చేస్తున్న ఈ నాయిక రెడ్ కార్పెట్పై నడిచి ఆహుతులను అలరించింది.
ఈ సందర్భంగా ఆమె భారతీయ సినిమా పురోగమనం గురించి సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీపికా పడుకోన్ మాట్లాడుతూ…‘ప్రతిష్టాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తుండటం సంతోషంగా ఉంది. ఈ చిత్రోత్సవాలకు 75 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఒకప్పుడు మన సినిమాలకు ఇంత ప్రాముఖ్యత లేదు.
ఆహ్వానం అందుకున్న సినీ తారలూ తక్కువే. కానీ ఇవాళ కేన్స్లో భారతీయ సినిమా పతాకం ఎగురుతున్నది. మనమంతా ఐక్యంగా సాధించిన విజయమిది. మన సినిమా ఇంకా సుదూర ప్రయాణం చేయాల్సి ఉంది’ అని చెప్పింది. ఈసారి కేన్స్ చిత్రోత్సవాల్లో దీపికాతో పాటు తమన్నా, పూజా హెగ్డే, నవాజుద్దీన్ సిద్ధిఖీ, కమల్ హాసన్, ఏఆర్ రెహమాన్, ఆర్ మాధవన్ పాల్గొన్నారు.