తమిళ సినిమా ‘కిడ’ తెలుగులో ‘దీపావళి’ పేరుతో అనువాదమవుతున్నది. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ నిర్మించిన తొలి తమిళ చిత్రమిది. ఈ చిత్రం నవంబర్ 11న విడుదలకానుంది. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్.వెంకట్ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్ను అగ్ర హీరో రామ్ పోతినేని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
‘పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రమిది. తాత, మనవడు, ఓ మేక మధ్య ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరిస్తుంది. దీపావళి పండక్కి కొత్త బట్టలు కొనివ్వాలని మనవడు కోరడంతో మేకను అమ్మడానికి సిద్ధపడతాడు తాత. మొక్కు ఉన్న మేక కావడంతో దానిని కొనడానికి ఎవరూ ముందుకురారు. ఈ నేపథ్యంలో కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్లో సహజత్వం కనిపిస్తుంది’ అని నిర్మాత స్రవంతి రవికిషోర్ తెలిపారు. దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.