అజ్ఞాతవాసి చిత్రం తర్వాత సినిమాలకు చాలా దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ వరుస సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ కి పసందైన వినోదం అందించడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్గా భీమ్లా నాయక్ అనే చిత్రం చేస్తున్నాడు. జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతంగా జరుపుకుంటుంది.
తాజాగా చిత్రం నుండి అడవి తల్లి మాట అనే పాట విడుదల కాగా, ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్లో రికార్డ్స్ సృష్టిస్తోంది ఈ పాట. అయితే ఈ పాటను ఎవరు ఆలపించారు అని ఆరాలు తీస్తుండగా ఫోక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి కలిసి ఆలపించారు అని తెలిసింది. దుర్గవ్వ మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తి. ఏం చదువుకోలేదు. పొలం పనులకు వెళ్లినప్పుడు జానపదాలను పాడుతూ ఉండేది.
దుర్గవ్వ కేవలం తెలుగులోనే కాకుండా మరాఠీలోనూ అనేక పాటలు పాడారు. ఇక తెలుగులో దుర్గవ్వ పాడిన ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్తో నల్లమల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యని వెలుగులోకి తెచ్చారు పవన్ . నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందిన ఈయన తన తండ్రి ద్వారా ఈ కళను నేర్చుకున్నాడు. 7 మెట్ల కిన్నెరను 12 మెట్లగా మార్చి తన జానపద పాటలతో అలరిస్తుంటాడు.