నాని కథానాయకుడిగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ టీజర్ను అగ్ర దర్శకుడు యస్.యస్.రాజమౌళి సోమవారం విడుదల చేశారు. ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా మాస్ అవతారంలో నాని దర్శనమిచ్చారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 30న విడుదలకానుంది. టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో నాని మాట్లాడుతూ ‘నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన చిత్రమిది. తెలుగు సినిమాకు నేను ఏం చేశానని ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడిని. కానీ గర్వంగా ఈ మాట చెబుతున్నా.. తెలుగు, ఇండియన్ సినిమాకు ఈ ఏడాది నా తరపున పెద్ద కాంట్రిబ్యూషన్గా ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను అందిస్తున్నా.
సినిమా విడుదలయ్యాక నేను ఈ మాటలు ఎందుకు చెప్పానో అర్థమవుతుంది. టీజర్ శాంపిల్ మాత్రమే. సినిమా అదిరిపోతుంది’ అన్నారు. సింగరేణి నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాని..ధరణి అనే గ్రామీణ యువకుడి పాత్రలో కనిపించారు. ‘ఈర్లపల్లి..చుట్టూరా బొగ్గు కు ప్పలు..తొంగి చూస్తే కానీ కనిపించని ఊరు..’ అంటూ నాని మాటలతో మొదలైన టీజర్ ఆసక్తిని పంచింది. ‘ ఎట్లయితే గట్లాయే గుండుగుత్తగా లేపేద్దాం’ వంటి సంభాషణలు పవర్ఫుల్గా అనిపించాయి. సింగరేణి సమీప గ్రామం ఈర్లపల్లిలో చోటుచేసుకునే రాజకీయాలు, ఆధిపత్య శక్తులపై సాధారణ యువకుడు ధరణి సాగించే పోరాట నేపథ్య కథాంశమిదని టీజర్ ద్వారా తెలుస్తున్నది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు.