Dadasaheb Phalke Film Awards | ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్ఎఫ్)- 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. ఇక ఈ అవార్డు వేడుకల్లో ‘జవాన్’(Jawan) చిత్రానికి గాను బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్ (Shah Rukh Khan)ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ అవార్డును నాతో పాటు నామినేట్ అయిన సహ నటులకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. నాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అంటే ఎంతో గౌరవం. చాలా ఏండ్ల తర్వాత ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నా. ఈ విజయం సాధించినందుకు నా స్నేహితుడు విధు వినోద్ చోప్రా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సంతోష సమయాన్ని మేమిద్దరం షేర్ చేసుకుంటాం. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు జవాన్ చిత్రబృందానికి కృతజ్ఞతలు అంటూ షారుఖ్ చెప్పుకోచ్చాడు.
మరోవైపు జవాన్ సినిమాలో హీరోయిన్గా నటించిన నయనతార ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఇక గతేడాది యానిమల్ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా నిలిచారు.