వహీదా రెహమాన్. వెండితెరపై ఆమె ఓ పండువెన్నెల. అందుకే కదా.. గీతరచయిత షకీల్ ఆమెను ‘చౌద్విన్ కా చాంద్’గా అభివర్ణించారు. అవును.. నిజమే.. వహీదా చందమామ తునక. ఆమెను చూశాక చందమామని మగాడంటే మనసొప్పుకోదు. ఓ జనరేషన్కి నిద్రను కరువు చేసిన అరుదైన అందం వహీదా రెహమాన్. భారతీయ చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఆధ్యాయం ఆమెది. ఆ మహానటిని భారత ప్రభుత్వం 2021వ సంత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆమెను గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
వహీదా రెహమాన్ పుట్టింది తమిళనాడులోని చెంగల్పట్టులో. కానీ ఆమె బాల్యమంతా తెలుగునేల మీదే. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రిల్లో కొన్నాళ్ల పాటు ఆమె బాల్యం సాగింది. లలితకళలపై ఆమెకున్న మక్కువను గమనించిన తండ్రి, ఆ దిశగా ఆమెను ప్రోత్సహించడంతో సంగీతం, నాట్యంలో వహీదా సుశిక్షుతురాలయ్యారు.
‘రోజులు మారాయి’తో తెరంగేట్రం
17ఏళ్ల వయసులో తొలి అవకాశం తమిళ ‘అలీబాబా 40 దొంగలు’తో వరించినా.. ఆ సినిమా ఆలస్యం కావడంతో అక్కినేని ‘రోజులు మారాయి’(1955) వహీదా తొలి సినిమా అయింది. అందులో ఆమెది ఓ ప్రత్యేక గీతం మాత్రమే. ఆ పాట అప్పట్లో ఓ సంచలనం. ‘కల్లాకపటం కానని వాడ.. లోకం పోకడ తెలియని వాడ.. ఏరువాక సాగారో.. రన్నో చిన్నన్నా.. నీ కష్టమంతా తీరునురో.. రన్నో.. చిన్నన్నా..’ అన్నదాత జీవితానికి అద్దంపట్టేలా కొసరాజు రాసిన ఈ గీతాన్ని ఆ రోజుల్లో పాడుకోని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు. అలా ఓ సంచలనాత్మకమైన గీతంతో ఓ సంచలనం వెండితెరకు పరిచయమైంది. ఆ వరుసలో మళ్లీ తెలుగు సినిమానే చేశారు వహీదా రెహమాన్. ఆ సినిమానే ఎన్టీయార్ ‘జయసింహ’(1955). కథానాయికగా వహీదా తొలి సినిమా ఇది. అంతేకాదు, నిర్మాతగా ఎన్టీయార్కు తొలి విజయం కూడా ఇదే. ఇందులో ఎన్టీయార్, వహీదా రెహమాన్ జంటను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఆ తర్వాత తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసిన ఆమె, దేవానంద్ ‘సీఐడీ’(1956)తో బాలీవుడ్లో అడుగుపెట్టారు. అప్పట్నుంచి మొదలైంది వహీదా ప్రభ.
‘ప్యాసా’తో తారాపథంలోకి..
గురుదత్ ‘ప్యాసా’(1957). ఇండియన్ టాప్ ఫైవ్ క్లాసిక్స్లో ఒకటిగా చెప్పుకునే అద్భుత ప్రేమకావ్యం. ఈ సినిమాతోనే వహీదా బాలీవుడ్ సూపర్స్టార్గా అవతరించారు. అంతేకాదు గురుదత్, వహీదా జంట ప్రేక్షకులకు అభిమాన జంటగా మారింది. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ క్లాసిక్సే. కాగజ్ కా ఫూల్, చౌద్విన్ కా చాంద్, సాహెబ్ బీబీ ఔర్ గులామ్.. ఇలా అన్నీ అద్భుతాలే. ఆణిముత్యాలే. గురుదత్ సినిమాల తర్వాత దేవానంద్ సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ఈ సినిమాలతో నటిగా ఆకాశమంత ఎత్తులో నిలిచారు వహీదా. 1956 – 1966 ఈ పీరియడ్ బాలీవుడ్లో వహీదా రెహమాన్ శకంగా చెప్పొచ్చు.
ప్రతిభకు వరించిన పురస్కారాలు
చాలా విరామం తర్వాత 1974లో మళ్లీ తెలుగు సినిమా చేశారు వహీదా. ఆ సినిమానే అక్కినేని ‘బంగారు కలలు’. ఆ తర్వాత 1986లో సూపర్స్టార్ కృష్ణ ‘సింహాసనం’ సినిమాలో మహారాణిగా మెరిశారు. 2006లో వచ్చిన ‘చుక్కల్లో చంద్రుడు’ తర్వాత ఆమె తెలుగులో మళ్లీ నటించలేదు. హిందీ, తెలుగుతోపాటు తమిళం, మలయాళం, బెంగాలీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించిన ఘనత వహీదా రెహమాన్ది. భారత ప్రభుత్వం 1972లోనే ఆమెకు ‘పద్మశ్రీ’ పురస్కారం వరించింది. 2006లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’తో గౌరవించింది. 2011లో ‘పద్మభూషణ్’ పురస్కారం కూడా ఆమె అందుకున్నారు. ఈ విధంగా ఆమె అందుకోని అవార్డుల్లేవు. ఇప్పుడు ఆమె కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. అదే ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం’. దేశంలోని కళాకారులందరూ అత్యున్నత పురస్కారంగా భావించే ఈ అవార్డుకు మహానటి వహీదా రెహమాన్ని ఎంపిక చేయడం నిజంగా ఆనందించదగ్గ విషయం.