‘బాలకృష్ణగారి కెరీర్లోని గొప్ప సినిమాల్లో ఒకటిగా ‘డాకు మహారాజ్’ నిలుస్తుందని గతంలో ఓ ప్రెస్మీట్ సందర్భంగా నిర్మాత నాగవంశీ అన్నారు. ఆయన ఈ సినిమాను అంత నమ్మారు. ఈరోజు ఆయన నమ్మకం నిజమైంది. ప్రేక్షకుల్లో వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో హిట్ అందుకున్నా. ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో వచ్చా. సంక్రాంతి నాకు ప్రత్యేకమైన పండుగలా మారిపోయింది. తమన్ సంగీతం, విజయ్ కార్తీక్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు ప్రధాన బలాలు. బాలకృష్ణగారి తర్వాత ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ వీరిద్దరే.
మనసుపెట్టి సినిమా చేస్తే దాన్ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటారని ‘డాకు మహారాజ్’తో రుజువైంది.’ అని దర్శకుడు బాబీ కొల్లి అన్నారు. ఆయన దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఆదివారం విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకున్నదని టీమ్ ఆనందం వ్యక్తం చేస్తూ ఆదివారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ వారం అనంతపూరంలో సక్సెస్మీట్ నిర్వహించనున్నామని, అద్భుతమైన విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, డీవోపీ విజయ్ కార్తీక్ కన్నన్ కూడా పాల్గొన్నారు.