CPI Narayana | హైదరాబాద్లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖులు సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లు వస్తున్న వార్తలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సినిమా విడుదల సమయంలో ప్రభుత్వాల నుండి ప్రత్యేక అనుమతులు తెచ్చుకుని టికెట్ల ధరలు పెంచడం, ఆ పెరిగిన మొత్తంలో వాటాల పంపకాలపై సినీ పెద్దలు చర్చిస్తున్నారనే వార్తలు సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
పెద్ద సినిమాలకు భారీగా ఖర్చులు అవుతున్నాయనే నెపంతో “బెనిఫిట్ షోలు”, “ప్రత్యేక షోలు” ఏర్పాటు చేసి సాధారణ ప్రజలపై అదనపు భారం మోపడం ఎంతమాత్రం సమంజసం కాదని నారాయణ స్పష్టం చేశారు. “కళల పేరుతో ప్రజల జేబులు ఖాళీ చేయడం సరైన విధానం కాదు. సినిమా అనేది కేవలం ఒక వినోద మాధ్యమం. అది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి గానీ, కొద్దిమంది వ్యాపార ప్రయోజనాలకు వేదిక కాకూడదు” అని ఆయన హితవు పలికారు. ప్రస్తుత రోజుల్లో ఒక సినిమా విడుదలైతే కుటుంబంతో కలిసి థియేటర్కు వెళ్లి చూడాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ భారాన్ని మోస్తున్నది సామాన్య ప్రజలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా టికెట్ల ధరలు పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో ఎవరికి ఎంత వాటా దక్కాలనే దానిపై ఇండస్ట్రీలో చర్చలు జరగడం మరింత విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు.
సినిమా టికెట్ ధరల విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు స్పష్టమైన, పారదర్శకమైన, ఒకే విధమైన పాలసీ ఉండాలని నారాయణ డిమాండ్ చేశారు. ప్రతి సినిమా పేరుతో ప్రత్యేక అనుమతులు ఇవ్వడం, ఇష్టానుసారంగా ధరలు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడం వంటి చర్యలను ప్రభుత్వాలు నియంత్రించాలన్నారు. కళల అభివృద్ధి పేరుతో జరిగే ఇలాంటి దోపిడీకి ఎక్కడా తావు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. థియేటర్లలో ఇటువంటి అధిక ధరలు, అన్యాయమైన టికెట్ వ్యవస్థల వల్లనే సామాన్య ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని, దీని కారణంగానే “ఐ బొమ్మ” వంటి పైరసీ, ప్రత్యామ్నాయ సంస్కృతులు పుట్టుకొస్తున్నాయని ఆయన విశ్లేషించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల ఆర్థిక స్థితిగతులను, సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సినిమా టికెట్లపై సరైన నిర్ణయాలు తీసుకోవాలని సీపీఐ నారాయణ కోరారు.