Tollywood | తెలుగు చిత్ర పరిశ్రమను ఏళ్లుగా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పైరసీ ముఠా ‘ఐబొమ్మ’కు పెద్ద దెబ్బ పడింది. ఈ వెబ్సైట్ ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడంతో సినీ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, అగ్ర నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిటీ పోలీస్ కమిషనర్ బీసీ సజ్జనార్ను ప్రత్యేకంగా కలిసి చర్చించారు. ఈ సమావేశంలో ఐబొమ్మ పైరసీ నెట్వర్క్ గురించిన కీలక అంశాలు ముందుకు వచ్చాయి. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కమిషనర్ సజ్జనార్ సంచలన వివరాలు వెల్లడించారు. “పైరసీ దేశవ్యాప్త సమస్య. దీనివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం జరిగింది. చాలా కాలంగా ఎదురుచూసిన ప్రధాన నిందితుడు ఇమ్మడి రవిని ఎట్టకేలకు పట్టుకోవడంలో విజయం సాధించాం” అని చెప్పారు.
ఇమ్మడి రవి కార్యకలాపాలపై కీలక విషయాలను వెల్లడించిన సజ్జనార్.. టాలీవుడ్తో పాటు బాలీవుడ్ సినిమాలను కూడా భారీ స్థాయిలో పైరసీ చేశాడని తెలిపారు. రవి వద్ద 3 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. విచారణలో రవి 20 కోట్లకు పైగా సంపాదించినట్లు ఒప్పుకున్నాడని చెప్పారు. ఈ కేసులో మరో భయంకరమైన కోణాన్ని బయటపెడుతూ.. రవికి 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా ఉన్నట్లు, ఆ డేటాను డార్క్ వెబ్లో అమ్మే అవకాశం కూడా ఉండేదని సజ్జనార్ అన్నారు. పైరసీ ముసుగులో ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేసినట్లు వెల్లడించారు.
రవికి ఉన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ గురించి సీపీ సజ్జనార్ మరిన్ని విషయాలు తెలిపారు. మహారాష్ట్రలో ‘ప్రహ్లాద్’ పేరిట నకిలీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డ్ సృష్టించుకున్నాడు.పోలీసులకు దొరకకుండా కరేబియన్ దీవుల పౌరసత్వం తీసుకున్నాడు.ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్ వంటి దేశాల్లో తిరుగుతూ, అమెరికా, నెదర్లాండ్స్లో సర్వర్లు పెట్టి రాకెట్ నడిపాడు. ఈ కేసులో ఇప్పటికే దుద్దెల శివరాజ్, ప్రశాంత్లను అరెస్ట్ చేశామని, మొత్తం అయిదు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఐబొమ్మ వెనుక ఇంకా భారీ నెట్వర్క్ ఉందని, దాని పై లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నదని సిటీ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.