తాండూరు, మార్చి 23 : నీటి ఎద్దడి సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే నీటి వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. తాండూరు పట్టణం, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ ప్లాంట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు నిర్వాహకులు కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కాసులకు కక్కుర్తిపడి విచ్చలవిడిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ప్రజల ఆరోగ్యం పాలిట శాపంగా మారుతున్నారు. 20 లీటర్లకు రూ.20 చొప్పున ఆటోలపై ఇంటింటికి తిరుగుతూ అమ్ముతున్నారు.
నీటి శుద్ధి ఎక్కడ..?
మినరల్ వాటర్ ప్లాంట్లు నిబంధనల ప్రకారం పని చేస్తే ప్రతి 5 వేల లీటర్ల నీటిని శుద్ధి చేసేందుకు 35 వేల లీటర్లు వృథా నీరు బయటకు వస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ వృథా నీరు తిరిగి భూమిలోకి ఇంకేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ప్లాంట్ల నిర్వాహకులు మాత్రం మురుగు కాలువల్లోకి వదులుతున్నారు. దీంతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. అందుకు వృథా నీటిని భూమిలోకి ఇంకేందుకు అక్కడే ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.
ఇవి నిబంధనలు…
మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే స్థానిక సంస్థలైన మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతి వాటర్ ప్లాంట్ బీఐఎస్ కలిగి ఉండాలి. వాల్టా చట్టం ప్రకారం బోరుకు అనుమతులు పొందాలి. ప్రజా ఆరోగ్య, ఆహార భద్రత, తూనికలు, కొలతలు, కార్మిక శాఖ, కాలుష్య నియంత్రణ శాఖ అనుమతులుండాలి. నీటిని నింపే ప్రతి క్యాన్పై తయారు చేసిన తేది, బ్యాచ్ నంబర్, ఎక్స్పైరీ తేదీ, ధర ఖచ్చితంగా ముద్రించాలి. డబ్బాలో నీళ్లు నింపే ముందు శుభ్రం చేయాలి. ఒక్కొక్క క్యాన్ను 30 నుంచి 50సార్ల కంటే ఎక్కువ వాడకూడదు.
ప్రస్తుత పరిస్థితి ఇది..
తాండూరు నియోజకవర్గంలో 80 వరకు వెలసిన వాటర్ ప్లాంట్లలో 10 వరకు తప్ప మిగిలిన ఏ ప్లాంటుకూ ఎటువంటి గుర్తింపు లేదు. కనీసం మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ అనుమతులు కూడా లేవు. మొదట్లో అనుమతులు తీసుకున్నవారు సమయం అయిపోయినా రెన్యువల్ చేసుకోనట్లు సమాచారం.