Allu Arjun | నాంపల్లి/ఖైరతాబాద్/చిక్కడపల్లి, క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్రోడ్డులోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కేసు నమోదైనట్టు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్షయాదవ్ తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ, థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
గురువారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ వస్తున్నట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, ఇదే ఘటనపై అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్పై తెలంగాణ లీగల్సెల్ ఉపాధ్యక్షుడు తిరుపతివర్మ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు ప్రభుత్వంతోపాటు నటుడు అల్లు అర్జున్, నిర్మాణ సంస్థ బాధ్యత వహించాలని న్యాయవాది పీ శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ సతీశ్ కమాల్, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించారని విమర్శించారు. నిజానికి బెనిఫిట్ షో డబ్బులు చారిటీకి ఇవ్వాలని, మరి ఈ డబ్బులు ఏమయ్యాయో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. తొక్కిసలాట ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతోపాటు వారి కుమారుడి చదువు బాధ్యతలు అల్లు అర్జున్ చూసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు.
థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్ (13)కు అల్లు అర్జున్ అంటే ఎనలేని ఇష్టం. అదే ఇప్పుడు అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. పుష్ప-2 ప్రీమియర్ షో చూడాలని కుమారుడు పట్టుబట్టడంతో తండ్రి భాస్కర్ రూ.1100 చొప్పున టికెట్లు కొని భార్య రేవతి, కుమారుడితో కలిసి వెళ్లారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా, శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది. ఏడాది క్రితం భాస్కర్ అనారోగ్యానికి గురైతే రేవతి తన కాలేయాన్ని ఇచ్చి కాపాడుకుంది. ప్రాణాపాయం నుంచి భర్తను కాపాడిన ఆమె ఇప్పుడిలా మృతి చెందడంతో అది తలచుకుని కుటుంబ సభ్యులు, బంధువులు విలపిస్తున్నారు.