ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్స్ చాలా కొత్తగా ఉంటున్నాయి. సినిమా ఏ నేపథ్యంలో తెరకెక్కితే అదే స్టైల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరిపి మూవీపై అంచనాలు పెంచుతున్నారు. తాజాగా సెప్టెంబర్ 10న విడుదల కానున్న సీటీమార్ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కబడ్డీ నేపథ్యంలో గోపీచంద్ హీరోగా సంపత్ నంది సీటీమార్ చిత్రాన్ని రూపొందించగా, ఈ వేడుకలో స్టేజ్పైన అమ్మాయిలతో కబడ్డీ ఆడి అలరించారు గోపిచంద్.
చిత్రంలో తమన్నా కథానాయికగా నటించగా, ఆమె కోచ్ పాత్రలో సందడి చేయనుంది. భూమిక కీలక పాత్ర పోషించారు. చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకి ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, మారుతి, లింగుస్వామి, శ్రీవాస్, ప్రశాంత్ వర్మ, కోన వెంకట్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.
‘2019 డిసెంబరులో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. 50శాతం చిత్రీకరణ పూర్తయ్యాక కొవిడ్ ప్రారంభమైంది. విడుదల సమయంలో సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో సినిమా రిలీజ్కి ఇంత సమయం పట్టిందని అన్నారు గోపిచంద్. మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి థియేటర్లలో కూర్చోబెట్టే సత్తా ఈ చిత్రానికి ఉంది. దీన్ని ఆదరిస్తే మిమ్మల్ని అలరించేందుకు ఇంకా ఎన్నో సినిమాలు థియేటర్లలోకి వస్తాయి. మరోసారి చెబుతున్నా.. మీరు ఎంజాయ్ చేసే ఇంటికి వెళ్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు’ అని చెప్పుకొచ్చారు గోపిచంద్.