వ్యాఖ్యాత క్రిస్ రాక్ను హాలీవుడ్ హీరో విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టడం గత ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో సంచలనమైంది. అతని చర్యపై ఆగ్రహించిన ఆస్కార్ కమిటీ అవార్డులకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకుండా పదేళ్ల నిషేధం విధించింది. ఇక వచ్చే ఏడాది వేడుక కోసం ఆస్కార్ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. వ్యాఖ్యాతగా మరోసారి క్రిస్ రాక్ను సంప్రదించారు. తాను మళ్లీ ఆస్కార్ వేదిక మీదకు రానని ఈ హాస్యనటుడు తేల్చి చెప్పాడు. అతను స్పందిస్తూ…‘మరోసారి ఆస్కార్ వేదికకు వ్యాఖ్యాతగా వెళ్లను. ఆ వేదిక క్రైమ్ సీన్ జరిగిన ప్రాంతంలా అనిపిస్తున్నది’ అంటూ సరదాగా జవాబిచ్చారు. గత సంఘటనలు పునరావృతం కాకుండా అవార్డుల వేడుకల్ని నిర్వహిస్తామని ఆస్కార్ కమిటీ చెబుతున్నది.