Dhruva Natchathiram Movie | మాములుగా ఒక సినిమా షూటింగ్ పూర్తవడానికి దాదాపుగా ఆరునెలలు సమయం పడుతుంది. అదే రాజమౌళి, శంకర్ వంటి దర్శకులు రెండు, మూడేళ్లు తీసుకుంటారు. కానీ ఒక దర్శకుడికి మాత్రం షూటింగ్ పూర్తి చేయడానికి ఏకంగా ఏడేళ్లు సమయం పట్టింది. డెబ్యూ సినిమానేమో, చిన్న దర్శకుడేమో,లైమ్ లైట్లో లేడేమో అని అనుకుంటున్నారేమో! అస్సలు కాదండి. కమల్ హాసన్, వెంకటేష్, సూర్య వంటి అగ్ర హీరోలకు బ్లాక్బస్టర్ హిట్లనిచ్చిన దర్శకుడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరా అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు గౌతమ్ వాసుదేవ మీనన్.
ఆ సినిమాపేరు ధృవ నచ్చతిరమ్. విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏడేళ్ల కిందట అంటే 2016లో షూటింగ్ మొదలయింది. కానీ తుది దశకు వచ్చే వరకు ఏకంగా ఏడేళ్లు పట్టింది. చిన్న హీరో, పెద్దగా మార్కెట్ లేదు. అందుకే షూటింగ్ ఆలస్యమయింది అంటే అర్ధముంది. కానీ విక్రమ్ లాంటి క్రేజ్ ఉన్న నటుడు సినిమా ఇన్నేళ్లు పట్టిందంటే ఆశ్చర్యంగానే ఉంది. గౌతమ్ ముందుగా ఈ సినిమాను సూర్యతో ప్లాన్ చేసుకున్నాడు. కానీ కుదరక విక్రమ్తో పట్టాలెక్కించాడు.
సినిమా లాంచింగ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్గా నిర్వహించారు. తమిళంలోని పెద్ద పెద్ద స్టార్లను లాంచింగ్ ఈవెంట్కు పిలిచారు. విక్రమ్ కెరీర్లో అత్యధిక బడ్జెట్ కేటాయించిన సినిమా ఇదే. ఏడు దేశాల్లో చిత్రీకరణ జరిపారు. బడ్జెట్ బౌండరీలు దాటింది. ముందు వేసుకున్న లెక్కలకి, పెరుగుతున్న బడ్జెట్కు సంబంధంలేకుండా పోయింది. పైగా ఈ సినిమా నిర్మాత కూడా గౌతమ్ మీననే. ఆయనతో పాటు మరో ఇద్దరూ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. దాంతో బడ్జెట్ ఇష్యూస్ వల్ల సినిమాకు బ్రేకులు పడ్డాయి.
అంతలోనే గౌతమ్ మీనన్ నటుడిగా తెగ బిజీ అయిపోయాడు. మరోవైపు విక్రమ్ కూడా తన ప్రాజెక్ట్లతో బిజీ అయిపోయాడు. దీంతో ఆ ప్రాజెక్ట్కు దిక్కు మొక్కు లేకుండా పోయింది. అయితే గతేడాది విడుదలైన ‘పొన్నిసెల్వన్’తో ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలింది. ఆ సినిమాతో విక్రమ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆ క్రేజ్ను క్యాష్ చేసుకుంటేనే సినిమాకు బజ్ ఉంటుందని భావించి తాజాగా చెన్నైలో బ్యాలెన్స్ పార్టును పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తారట.
అయితే అప్పటికి ఇప్పటికి ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. 2016లో రాసుకున్న కథను 2023లో ఒక ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయాలంటే ఆ కథలో ఎంతో మ్యాటర్ ఉండాలి. పైగా గౌతమ్ దర్శకత్వం వహించిన గత రెండు మూడు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. గతేడాది రిలీజైన శింబు సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చినా.. కమర్షియల్గా విజయం సాధించలేకపోయింది. మరీ ఏ ధైర్యంతో ఇప్పడు ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారో వాళ్లకే తెలియాలి. రీతూవర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జయరాజ్ స్వరాలు సమకూర్చుతున్నాడు.