దేశమంతా వినాయక చవితి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లలు, పెద్దలు ఈ వేడుకని ఘనంగా జరుపుకుంటున్నారు. ఓ గణాధిపా! జన మనో నాయకా వినాయకా! విఘ్నాలు తొలగించు. విజయాలు కలిగించు. కరోనాను నిర్మూలించు. మమ్మల్ని ఆశీర్వదించు అంటూ ప్రతి ఒక్కరు ఆ గణనాధుడిని పూజిస్తున్నారు. అంతేకాక వినాయక ప్రతిమల ముందు పూజలు చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో..జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు, ఆటంకాలు తొలగి అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ది పథంలో సాగాలని కోరుకొంటున్నాను అని పేర్కొన్నారు. అలానే తన ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకకు సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేశారు.
మహేష్ బాబు కూడా తన ఇంటి వినాయకుడిని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలో తన కూతురు సితార క్యూట్ స్మైల్ ఇస్తూ కనిపిస్తుంది. సినీనటుడు మోహన్ బాబు విఘ్నేశ్వరుడి పూర్తి కథను చెప్పారు. ఈ కథ చెప్పాలని తన కుమారుడు మంచు విష్ణు కోరడంతో ఈ కథ చెబుతూ ఈ ఆడియో రికార్డు చేశానని మోహన్ బాబు అన్నారు. ఈ ఆడియోను మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.