టోక్యో ఒలింపిక్స్లో భారత్ కు వెయిట్ లిఫ్టింగ్లో పతకం తీసుకొచ్చిన మణిపూర్ మణిపూస మీరాబాయి చానుపై మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా ప్రశంసల జల్లు కురిపించారు. మధ్యతరగతి నుండి వచ్చిన మీరాబాయి ఒలంపిక్స్లో తన ప్రదర్శనతోనే కాకుండా మంచి మనసుతో అందరి మనసులని గెలుచుకుంటుంది.
శిక్షణా కేంద్రానికి వెళ్లేందుకు రెగ్యులర్గా లిఫ్ట్ అందించిన ట్రక్కర్లను కలిసి, వారి ఆశీర్వాదం తీసుకుంది మీరాబాయి. ఇదే విషయంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. నువ్వు శిక్షణ కోసం వెళ్లివస్తున్న సమయంలో నీకు సాయం చేసిన 150 మందిని గుర్తు పెట్టుకోవడం గొప్ప విషయం. వారిని నువ్వు సన్మానించిన తీరు నీ మంచి మనసుకు నిదర్శనం.. చేసిన సాయం గుర్తు పెట్టుకుని ఇంటికి పిలిచి మరీ సన్మానించిన నీ మనసు నిజంగా బంగారం అంటూ మీరాబాయి చాను పై చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రశంసలు వర్షం కురిపించారు.
మణిపూర్ లోని నాంగ్పాక్ కాచింగ్ గ్రామంలో జన్మించిన మీరాబాయి శిక్షణ నిమిత్తం తన గ్రామానికి 25 కిలోమీటర్ల దూరంలోని ఇంపాల్ కు ప్రతి రోజు వెళ్లి వచ్చే వారు. రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో శిక్షణకు వెళ్ళడానికి మీరా ట్రక్కులో పయనించే వారు. ఆ సమయంలో తనకు సాయపడ్డ 150 మంది ట్రక్ డ్రైవర్స్ని గుర్తు పెట్టుకొని వారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఒక షర్ట్, మణిపురి కండువాను బహుమానంగా ఇచ్చి సత్కరించింది. అంతేకాక తన విజయానికి తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి సాయం అందిస్తూ మంచి మనసు చాటుకుంటుంది మీరాబాయి.