స్వయంకృషితో మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి ఆరు పదుల వయస్సులోను కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం చిరంజీవిది. దాసరి మరణం తర్వాత సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరిస్తున్న చిరు.. కరోనా కష్టకాలంలో చాలా మందికి సాయాలు చేశారు. కరోనా క్రైసిస్
ఛారిటీని స్థాపించి సినీ కార్మికులకి అండగా నిలిచారు. చిరుని స్పూర్తిగా తీసుకొని ఆయన అభిమానులు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
దాదాపు 9 ఏళ్ల తర్వాత ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్నారు . ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా కరోనా వలన పలుమార్లు వాయిదా పడింది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఆచార్య తరువాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ దాదాపు ఖరారైంది.
బాబీ, మెహర్ రమేష్ డైరెక్షన్లో నెక్ట్స్ ప్రాజెక్ట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి.. సంపత్ నంది, వంశీ పైడిపల్లి, ప్రభుదేవా దర్శకత్వంలోను సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే లాక్డౌన్ వలన ఇంటికే పరిమితమైన చిరు ఇప్పుడు షూటింగ్స్తో బిజీ కావాలని అనుకుంటున్నారు.ఈ క్రమంలో స్లిమ్ లుక్లో మారి తాజాగా ఫొటో షూట్ చేశారు. ఆరులో ఇరవైలా కనిపిస్తున్న చిరుని చూసి అభిమానులు ముక్కునే వేలేసుకుంటున్నారు.