చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. మంగళవారం సాయంత్రం ఏపీ, తెలంగాణలో 152 థియేటర్లలో అభిమానుల సమక్షంలో ట్రైలర్ను విడుదల చేశారు. చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా కాబట్టి ఆ సంఖ్యలో థియేటర్లలో ట్రైలర్ ప్రదర్శన జరిపారు. ‘దివ్య వనమొక వైపు, తీర్థ జలమొక వైపు నడుమ పాదఘట్టం’ అంటూ రామ్ చరణ్ వాయిస్తో ట్రైలర్ ప్రారంభమైంది. ‘సౌమ్యులైన పాదఘట్టం ప్రజలు ఆపదొస్తే అమ్మోరు ఆవహించినట్లు మారిపోతారు, ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవుతది…’ అంటూ చరణ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. యాక్షన్ ప్యాక్డ్ గా చిరంజీవి ఆచార్య పాత్రను మలచినట్లు తెలుస్తున్నది.
‘పాదఘట్టం వాళ్ల గుండెల మీద కాలు వేస్తే ఆ కాలు తీసేయాలంటా, నేనొచ్చానని చెప్పాలనుకున్నా, కానీ చేయడం మొదలుపెడితే’..అంటూ చిరు మాస్ డైలాగ్స్ చెప్పారు. సిద్ధ మీకు తెలుసా అనగానే…చిరు, చరణ్ల ఫ్లాష్ బ్యాక్ సీన్ ఓపెన్ అవడం ఆసక్తి రేపుతున్నది. అందమైన ప్రకృతితో అలరారే పాదఘట్టం ఊరిలో దుర్మార్గులు అలజడి రేపితే వారికి బుద్ధి చెప్పిన ఇద్దరు కామ్రేడ్స్ కథగా ఈ సినిమా ఉంటుందని అనుకోవచ్చు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో కలిసి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నాయికలు. తుది హంగులు అద్దుకుంటున్న ‘ఆచార్య’ ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతున్నది.