ఏడేండ్ల నిరీక్షణ ఫలించింది. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు విముక్తి లభించింది. విభజన అనంతరం ఏపీ తొలి ముఖ్యమంత్రి పెడపోకడల కారణంగా బుట్టదాఖలైన మన విజ్ఞప్తులు.. ప్రస్తుత ప్రభుత్వం సానుకూల స్పందనతో ఫలించాయి. 3, 4, తరగతులకు చెందిన 698 మంది ఉద్యోగులు స్వరాష్ర్టానికి బయలుదేరారు. మన ఉద్యోగులను వెనక్కి పంపించాలంటూ సీఎం కేసీఆర్ మాటను ప్రస్తుత ఏపీ సర్కారు గౌరవించి బుధవారం రిలీవ్ చేసింది.
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావం నుంచి పొరుగురాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఎట్టకేలకు స్వరాష్ర్టానికి తిరుగుపయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న 698 మంది తెలంగాణ ఉద్యోగులు.. అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటమేరకు ఏపీ సర్కారు తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను స్వరాష్ర్టానికి పంపించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సీఎస్ సోమేశ్కుమార్.. ఏపీకి లేఖ రాయడంతో అమరావతిలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను విడుదలచేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీని నెరవేర్చినట్టయింది. ఉద్యోగుల తుది కేటాయింపుల్లో తెలంగాణ స్థానికతకు చెందిన 698 మంది (3, 4వ తరగతి ఉద్యోగులు) ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సి వచ్చింది. వీరిని స్వరాష్ర్టానికి పంపించాల్సిందిగా మార్చి 10 న తెలంగాణ సీఎస్ సోమేశ్కుమార్ ఏపీ సీఎస్ ఆదిత్యానాథ్దాస్కు లేఖరాశారు. ఈ మేరకు బుధవారం ఏపీ సీఎస్ రిలీవ్ ఉత్తర్వులు జారీచేశారు. వీరంతా ఒకటిరెండు రోజుల్లో తెలంగాణ సచివాలంలో రిపోర్డ్ చేయనున్నారు. వీరికి ఏ విభాగంలో ఖాళీ ఉంటే.. అక్కడ పోస్టింగ్ ఇస్తారు. ఉద్యోగుల విభజనలో రాష్ట్రానికి మొదట కేటాయించిన ఉద్యోగుల సీనియార్టీకి విఘాతం కలుగకుండా లాస్ట్ సీనియార్టీని పరిగణనలోకి తీసుకుంటారు.
రాష్ట్ర ఏర్పాటు తరువాత ఉద్యోగుల విభజనలో తెలంగాణ ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. శాఖాధిపతి కార్యాలయాల్లో పనిచేసే క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను కూడా అకారణంగా 58: 42 కింద విభజించారు. ఉద్యోగుల విభజన సమయంలోనే కిందిస్ధాయి ఉద్యోగులు ఎక్కడి వాళ్లను అక్కడే ఉంచాలని సీఎం కేసీఆర్ డిమాండ్చేశారు. అప్పటి ఏపీ ముఖ్యమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి కూడాలేఖలు రాశారు. కానీ తెలంగాణపై అడుగడుగునా వ్యతిరేకత, అక్కసు వెల్లగక్కిన నాటి ఏపీ సీఎం.. తెలంగాణ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. తదుపరి సాధారణ ఎన్నికల తరువాత ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ ఈ అం శంపై సానుకూలంగా వ్యవహరించారు. ప్రగతిభవన్లో జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయడానికి జగన్ అంగీకరించారు. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నెల రోజుల్లో వారందరినీ ఇక్కడకు తీసుకురావాలని సీఎస్ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ ఏపీకి లేఖ రాశారు. అక్కడి నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు వచ్చేలా పర్యవేక్షించారు.
తెలంగాణ ఉద్యోగులను రిలీవ్చేయడం పట్ల అమరావతిలోని ఏపీ సచివాలయంలో బుధవారం రిలీవ్ అయిన తెలంగాణ ఉద్యోగులు ఏపీ సీఎం జగ న్ చిత్రపటానికి పాలాభిషేకంచేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజు. ఇచ్చినమాట ప్రకారం ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తెచ్చిన సీఎం కేసీఆర్కు తెలంగాణ సచివాలయ సంఘం తరపున ధన్యవాదాలు, మన ఉద్యోగులు తిరిగి మన వద్దకు రావడం చాలా సంతోషంగా ఉన్నది
మాధవరం నరేందర్రావు,సచివాలయం సంఘం అధ్యక్షుడు
సీఎంకు రుణపడి ఉంటాం ఉద్యోగ సంఘాల కోరిక మేరకు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్ధానికత కలిగిన ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకువచ్చిన సీఎం కేసీఆర్కు ఉద్యోగులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా విజ్ఞప్తిమేరకు ఏపీతో మాట్లాడి అక్కడ ఉన్న మన వారందరి కుటుంబాలకు విముక్తి కలిగించారు. అంచెలంచెలుగా అన్ని సమస్యలు పరిష్కరిస్తున్న సీఎం –మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో అధ్యక్షుడు
ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. ఉద్యోగుల పట్ల ఒక తండ్రిగా అడగగానే సమస్యలన్నీ పరిష్కరించారు. ఏడేండ్లుగా ఏపీలో ఉంటూ ఇబ్బందులకు గురవుతున్న తెలంగాణ ఉద్యోగుల గురించి చెప్పగానే మన వాళ్లు అక్కడెందుకు మన దగ్గరకు తెచ్చుకుందామని చెప్పారు. వెంటనే సీఎస్కు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణకు వచ్చిన ఆ ఉద్యోగుల కుటుంబాల తరపున సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
–వీ మమత, టీజీవో అధ్యక్షురాలు
సీఎం కేసీఆర్ ప్రత్యే క చొరవతో ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉ ద్యోగులను
ఆ ప్రభు త్వం రిలీవ్చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నెలలోపే సొంత రాష్ట్రానికి ఉద్యోగులను తీసుకురావడాన్ని హర్షిస్తున్నాం. దీంతో మరోసారి సీఎం
కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని తేలింది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
–నర్సింగ్యాదవ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు