‘మంచి కంటెంట్ ఉన్నప్పుడు రీమేక్ చేయడంలో తప్పులేదు. అలాంటి గొప్ప కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో ఈ సినిమా చేశాను. దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు’ అన్నారు అగ్ర నటుడు చిరంజీవి. ఆయన తాజా చిత్రం ‘భోళా శంకర్’ ప్రీరిలీజ్ వేడుక ఆదివారం హైదారాబాద్లో జరిగింది. మోహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘ఈ సినిమా తమిళ మాతృక ‘వేదాళం’ ఏ ఓటీటీ వేదికల్లో లేదు. ఎవరూ చూసి ఉండరు కాబట్టి కొత్త కథగానే ఫీలవుతారు.
మొన్న ‘బ్రో’ వేడుకలో పవన్కల్యాణ్ చెప్పినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ ఒక్కరి సొత్తు కాదు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడం నా బాధ్యతగా భావిస్తున్నా. ఇండస్ట్రీ అక్షయ పాత్ర వంటిది. ఎంత మంది వచ్చినా అక్కున చేర్చుకుంటుంది. నేను చిన్న పాత్రలు చేసి హీరోగా ఎదిగాను. నా ఉన్నతికి ఆదరించిన ప్రేక్షకులే కారణం. వారికి సర్వదా కృతజ్ఞతగా ఉంటాను’ అన్నారు. ‘నేను చిరంజీవి అభిమానుల్లో ఒకడిని. ఆయనతో సినిమా చేయడం నా అదృష్టం. దర్శకుడిగా ఇది నాకు పునర్జన్మగా భావిస్తున్నా. ఈ జనరేషన్కు గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు తరహాలో సినిమా అందించాలనే తపనతో ‘భోళా శంకర్’ చేశాను.
ఈ సినిమా మీ అందరిని ఆకట్టుకుంటుంది’ అని దర్శకుడు మెహర్ రమేష్ చెప్పారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ ‘చిరంజీవితో సినిమా చేయాలన్నది నా కల. అది ఈ సినిమాతో తీరింది. ఈ ప్రయాణంలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఓ మానవతావాదిని చూశా. అభిమానులకు కావాల్సిన ప్రతీ అంశం ఈ సినిమాలో ఉంటుంది’ అన్నారు. ‘ఈ సినిమా ద్వారా దర్శకుడు మోహర్ రమేష్ రూపంలో నాకు మంచి అన్నయ్య దొరికాడు. ఈ చిత్రానికి ముందు చిరంజీవిగారు మెగాస్టార్ అని తెలుసు. కానీ ఆయన మెగా హ్యుమన్ అని సినిమా తర్వాత తెలిసింది. ఆయన నుంచి క్రమశిక్షణ, సమయపాలన వంటి ఎన్నో విషయాలను నేర్చుకున్నా’ అని కీర్తి సురేష్ చెప్పింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబీ, సంపత్నంది తదితరులు పాల్గొన్నారు.