ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న (Taraka Ratna) పార్థీవదేహానికి నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు హైదరాబాద్లోని ఆయన స్వగృహానికి తరలివస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మోకిలలోని నివాసానికి వెళ్లి.. తారకరత్న పార్థీవదేహంపై పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు.
అనంతరం ఆయన సతీమణితోపాటు ఇతర కుటుంబసభ్యులను చిరంజీవి ఓదార్చారు. ఎంపీ విజయసాయిరెడ్డితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. మరోవైపు నందమూరి బాలకృష్ణను చూసిన తారకరత్న పిల్లలు బోరున విలిపిస్తూ ఆయన దగ్గరకు వచ్చారు. బాలకృష్ణ వారిని దగ్గరకు తీసుకొని ఓదార్చారు.
తారకరత్న పార్థీవదేహాన్ని అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫిలిం ఛాంబర్లో ఉంచనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తారకరత్నకు తుది వీడ్కోలు పలికేందుకు అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.