తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో గొప్ప గొప్ప నటులు ఉన్నారు. అందులో ‘నవరస నటన సార్వభౌమ’ కైకాల సత్యనారాయణ ఒకరు. ‘సిపాయి కూతురు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన అనతికాలంలోనే విలక్షణ నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం సినిమా చేస్తున్నాడంటే ఈయన పక్కా ఉండాల్సిందే. ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాల్లో కైకాల డూప్గా నటించాడు. ఇక ఈయన హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటివరకు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం ఈయన అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితం అయ్యాడు. చివరగా కైకాల ‘N.T.R కథానాయకుడు’, ‘మహర్షి’ సినిమాల్లో నటించాడు. కాగా సోమవారం కైకాల సత్యనారాయణ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో బర్త్డే విషెస్ను తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో చిరంజీవి స్వయంగా కైకాల ఇంటికి వెళ్ళి కేక్ కట్చేయించి బర్త్డే విషెస్ను తెలియజేశాడు. కాసేపు ఆయనతో మాట్లాడి.. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాడు. అనంతరం చిరు కేక్ కట్చేయించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశాడు. ‘పెద్దలు, శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టిన రోజున, వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్విటర్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా చిరంజీవి గత కొన్నేండ్ల నుండి కైకాల పుట్టినరోజున స్వయంగా ఇంటికెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. ఇక చిరంజీవితో కైకాల దాదాపు 50కు పైగా చిత్రాల్లోనే నటించాడు.
పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది.
ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను 💐💐🙏🏻 pic.twitter.com/Dt2Yo2rp6i— Chiranjeevi Konidela (@KChiruTweets) July 25, 2022