Chirag Jani | టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్.జి దర్శకత్వంలో రూపొందుతున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘ద్రౌపది 2’ అనౌన్స్మెంట్ నుంచే చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. 14వ శతాబ్దపు దక్షిణ భారతదేశ చరిత్ర నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో బహుభాషా చిత్రంగా తెరకెక్కించారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘యు/ఎ’ (U/A) సర్టిఫికేట్ను పొందింది. ఈ సినిమాలో ముగ్గురు ప్రధాన విలన్లు ఉండగా, అందులో చిరాగ్ జానీ పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైందని చిత్రబృందం తెలిపింది. ఆయన ఈ చిత్రంలో మహమ్మద్ బీన్ తుగ్లక్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ పాత్ర గురించి దర్శకుడు మోహన్.జి మాట్లాడుతూ.. చరిత్రలో తుగ్లక్ను ‘తెలివైన మూర్ఖుడు’ అని అంటుంటారు. ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు రాజ్యాన్ని ఎలాంటి ఇబ్బందుల్లోకి నెట్టాయనే అంశాన్ని చిరాగ్ జానీ అద్భుతంగా పండించారు. గంభీరమైన లుక్తో పాటు మేధస్సును, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేస్తూ ఆయన చేసిన నటన సినిమాకే హైలైట్గా నిలుస్తుంది అని తెలిపారు.
గిబ్రాన్ అందించిన సంగీతం, ఫిలిప్ ఆర్. సుందర్ కెమెరా పనితనం ఈ విజువల్ వండర్కు మరింత బలాన్ని చేకూర్చాయి. చోళ చక్రవర్తి (నేతాజీ ప్రొడక్షన్స్), జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రిచర్డ్ రిషి హీరోగా, రక్షణ ఇందుసుధన్ హీరోయిన్గా నటించారు. నట్టి నటరాజ్, వై.జి. మహేంద్రన్, నడోడిగల్ భరణి, సరవణ సుబ్బయ్య, వెల్ రామమూర్తి, దినేష్ లాంబా, గణేష్ గౌరాంగ్, దివి, దేవయానీ శర్మ, అరుణోదయన్ వంటి భారీ తారాగణం ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవరాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రం నుంచి త్వరలోనే ట్రైలర్ను విడుదల చేసి, ఆడియో లాంచ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.