రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’కు కొన్ని మత సంస్థల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ చిత్ర బృందం మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ మహాకాలేశ్వర్ ఆలయానికి దర్శనం కోసం వెళ్లింది. నిరసనకారులు రణబీర్ కపూర్, ఆలియా భట్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టారు. భద్రతా కారణాలతో ఈ జంట ఆలయ దర్శనాన్ని రద్దు చేసుకున్నారు. బీఫ్ తినేందుకు ఇష్టపడతానంటూ 2012లో రణబీర్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్నామని ఆందోళనకారులు చెబుతున్నారు.
దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనీ, ‘బ్రహ్మాస్త్ర’ పేరును బ్రహ్మాస్త్ర ఫైల్స్గా మారిస్తే వారు సంతోషంగా సినిమా చూస్తారని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి. తమ మల్టీప్లెక్స్ ప్రాంఛైజీలో లక్ష టికెట్స్ బుక్ అయినట్లు పీవీఆర్ సంస్థ ప్రకటించింది. ఫాంటసీ అడ్వెంచర్ కథతో దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో నటించారు.