బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటిస్తున్న కొత్త సినిమా ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’. ఆలియా భట్ నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఆలియా ప్రెగ్నెన్సీ వల్ల కొంతకాలం ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారు. రణ్వీర్ సింగ్ తన గత మూడు చిత్రాలు ఆశించిన ఫలితాలు రాబట్టకపోవడంతో అభద్రతలో పడినట్లు తెలుస్తున్నది.
ఆయన నటించిన ‘83’, ‘జయేష్భాయ్ జోర్దార్’, ‘సర్కస్’ చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తన కొత్త సినిమాతో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం అందుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ సినిమా ఇప్పటిదాకా జరిపిన షూటింగ్ రష్ చూపించమని దర్శకుడు కరణ్ను రణ్వీర్ కోరాడని సమాచారం. ఈ రష్ చూసి సంతృప్తికరంగా అనిపిస్తేనే ముందుకు వెళ్దామని, లేకుంటే రీషూట్ జరపాలని రణ్వీర్ భావిస్తున్నాడట. ఫ్లాప్ భయంతోనే రణ్వీర్ ఇలా కోరాడని తెలుస్తున్నది. ఈ సినిమాలో ఆలియా, రణ్వీర్ కలిసి పాల్గొనే పాట చిత్రీకరణ త్వరలో జరపనున్నారు.