ముంబై: బాలీవుడ్ సినిమాలు, టీవీ షోల నిర్మాణంలో దూసుకుపోతున్న మహిళా ప్రొడ్యూసర్ ఏక్తాపూర్ (46)కు కరోనా వైరస్ సోకింది. ఆదివారం కరోనా పరీక్షలు చేయించుకోగా సోమవారం రిపోర్ట్స్ వచ్చాయని, ఆ రిపోర్టులలో తనకు కొవిడ్ పాజిటివ్గా తేలిందని ఏక్తాకపూర్ తెలిపారు. తన ఇన్స్టా హ్యాండిల్ ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల తనను కలిసిన వాళ్లంతా తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. కాగా ఇటీవల బాలీవుడ్లో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఈ ఉదయమే నటుడు, నిర్మాత జాన్ అబ్రహంకు, అతని భార్య ప్రియా రుంచాల్కు కరోనా పాజిటివ్ వచ్చింది. కొన్ని రోజుల క్రితమే మరో నటుడు నకుల్ మెహతాకు కరోనా సోకింది. ఆ తర్వాత ఆయన భార్య జాన్కీకి, పదకొండు నెలల కుమారుడు సూఫీకి వైరస్ సోకింది.