Bhola Shankar | చిరు కెరీర్లో తొలిసారి జీరో షేర్ అనే మాట వినాల్సి వచ్చిందంటే అది భోళా శంకర్ సినిమాతోనే. ఈ సినిమా కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. మెగా అభిమానులు దీన్నొక పీడకలలా వర్ణిస్తుంటారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా అందులో పావు వంతు కలెక్షన్లు కూడా తెచ్చిపెట్టలేకపోయింది. మెహర్ రమేష్ ఇంకా పాత చింతకాయ పచ్చడి విధానంలోనే సినిమాలను చేస్తున్నాడని ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇలాంటి సినిమాను చిరు సైతం ఎలా చేశాడంటూ పలువురు ఫ్యాన్స్ కూడా తీవ్రంగా నిరాశ పడ్డారు. ఆచార్యనే అనుకుంటే మెగాస్టార్కు భోళా శంకర్ అంతకంటే పెద్ద డిజాస్టర్నే మిగిల్చింది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ను లాక్ చేసుకుంది. సెప్టెంబర్ 15 అంటే రానున్న శుక్రవారం నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా రైట్స్ను నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. నిజానికి ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే జనాల్లో పెద్దగా అంచనాల్లేవు. చిరు ఫ్యాన్స్ సైతం ఇది కూడా పోతుందని ముందుగానే ఫిక్సయిపోయారు. అయితే కథలో మాస్ హంగులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఓ మోస్తరు విజయమైనా సాధిస్తుందని అనుకున్నారు. కానీ మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ తలకిందులయ్యాయి.
మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్గా తెరకెక్కింది. చిరుకు జోడీగా తమన్నా నటించగా.. కీర్తి సురేష్ చెల్లెలి రోల్ చేసింది. సుశాంత్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై అనీల్ సుంకర నిర్మించాడు.