Chiranjeevi | ‘ఖైదీనెంబర్ 150’ తర్వాత చిరుకు ఆ రేంజ్ హిట్ మొన్నటి వరకు లేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘సైరా’ పక్క రాష్ట్రాల సంగతి పక్కన పెడితే.. తెలుగులో పర్వాలేదనిపించే కలెక్షన్లతో లాక్కొచ్చింది. ఇక ‘ఆచార్య’ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. కనీసం సినిమా బడ్జెట్లో పావు వంతు కలెక్షన్లు కూడా రికవరి చేయలేకపోయింది. దసరా కానుకగా విడుదలైన ‘గాడ్ఫాదర్’ కూడా అంతే. తొలి రోజు పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా అప్పటికే ఎంతో మంది చూసేసిన ‘లూసీఫర్’కు రీమేక్గా రావడంతో ప్రేక్షకులు అంతగా ఆసక్తి కనబరచలేదు. దాంతో ఈ సినిమా కమర్షియల్ ఫేయిల్యూర్గా మిగిలింది. ముఖ్యంగా ఆచార్య, గాడ్ఫాదర్ ఫలితాలతో చిరు మార్కెట్ చాలా వరకు దెబ్బతింది.
ఇక చిరు కంబ్యాక్ ఇవ్వలేడు. ప్రేక్షకులకు చిరు బోరైపోయాడు. ఇకపై సినిమాలు తీసినా ఇదే పరిస్థితి ఎదురవుతుందంటూ ఎన్నో విమర్శలను చిరు ఎదుర్కొన్నాడు. కట్ చేస్తే వాల్తేరు వీరయ్యతో విమర్శలు చేసిన నోటీతోనే ప్రశంసలు దక్కించుకున్నాడు. వింటేజ్ బాస్ అంటూ ఈలలు వేయించుకున్నాడు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా తొలిరోజు పెద్దగా పాజిటీవ్ టాక్ ఏమి తెచ్చుకోలేదు. కానీ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో ఇదే కాస్త బెటర్గా ఉండటంతో ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. పైగా సంక్రాంతి సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ వాల్తేరు వీరయ్యను చూడడానికి థియేటర్లకు ఎగబడ్డారు. దాంతో ఈ సినిమాతో చిరు మార్కెట్ కూడా మరింత పెరిగింది. ఎంతలా అంటే భోళా శంకర్ సినిమా బిజినెస్ చూస్తే మతి పోయేంతలా.
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఇప్పటికే బిజినెస్ డీల్స్ కూడా అయిపోయినట్లు తెలుస్తుంది. ఒక్క నైజాంలోనే ఈ సినిమాకు రూ.25 నుంచి రూ.27 కోట్ల రేంజ్లో బిజినెస్ జరిగిందట. ఇక సీడెడ్ విషయానికొస్తే రూ.15 కోట్లు రేంజ్ లో డీల్ ఓకే అయిపోయిందట. మొత్తం ఆంధ్రాలో ఏకంగా రూ.40 కోట్ల రేంజ్ ధర పలికిందట. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు దాదాపు రూ.80 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లే. ఈ లెక్కలు చూస్తుంటే బాస్ మేనియా ఏ విధంగా ఉందో తెలుస్తుంది.
ఏకే ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్ గా తెరకెక్కుతుంది. మెహర్ రమేష్ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాతో మెగాఫోన్ పట్టాడు. 2013లో వచ్చిన షాడో తర్వాత ఇప్పటివరకు ఆయన మరో సినిమా చేయలేదు. దాంతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టాడట. ఎలాగైన చిరుకు అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇవ్వాలని తెగ ప్రయత్నం చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకు చెల్లెలుగా కనిపించనుంది.