‘అన్ని ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్ ప్యాక్డ్ మూవీ ‘భీమా’. ఈ సినిమాలో నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది’ అన్నారు హీరో గోపీచంద్. ఆయన కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమాకు ఎ.హర్ష దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ప్రియా భవానీశంకర్, మాళవికశర్మ కథానాయికలు. ఈ నెల 8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా గోపీచంద్ విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన సంగతులివి..
‘రాక్షసుడ్ని చంపాలంటే బ్రహ్మరాక్షసుడు రావాలి.. ఈ కథ అదే నేపథ్యంలో సాగుతుంది. ఇందులోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్ని దర్శకుడు చాలా గొప్పగా ఆవిష్కరించాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్లో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. అది అందరికీ నచ్చుతుంది.
కోవిడ్ టైమ్లో దర్శకుడు హర్ష ఓ పోలీస్ కథ చెప్పాడు. ఎందుకో అ కథకు కనెక్ట్ కాలేకపోయాను. ఇంకేదైనా కాప్ సబ్జెక్ట్ ఉంటే తీసుకురమ్మన్న్పాను. ఎనిమిది నెలల సమయం తీసుకుని ఈ కథ చెప్పాడు. కథ, కథలోని నా కేరక్టరైజేషన్, ఇందులో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ నాకు చాలా నచ్చాయి. అలా ‘భీమా’ మొదలైంది.
‘భీమా’ పాత్రలో గొప్ప ఇంటెన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రొమాన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమా చూసి బయటికి వచ్చాక కూడా కథ మనల్ని వెంటాడుతుంది. అంతటి భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది. ఇక ప్రతి యాక్షన్ సీన్ రోమాంచితంగా అనిపిస్తుంది.
గోలీమార్, ఆంధ్రుడు, శౌర్యం చిత్రాల్లో నేను పోలీస్ పాత్రల్ని పోషించాను. అయితే ఆ మూడింటికి పూర్తి భిన్నమైన పోలీస్ పాత్ర ఇది. పోలీస్ క్యారెక్టర్లోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్స్ చాలా కొత్తగా అనిపిస్తాయి. నా కెరీర్లో ‘భీమా’ ఓ వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది.
హర్ష అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను మలిచాడు. ఇందులో స్క్రీన్ప్లే గ్రిప్పింగ్గా ఉంటుంది. ఓ కొత్త అనుభూతిని ఇచ్చే సినిమా ఇది. ప్రచార చిత్రాలను చూసి ఈ సినిమాను అందరూ ‘అఖండ’తో పోలుస్తున్నారు. నిజానికి ‘అఖండ’కూ ఈ సినిమాకూ సంబంధం ఉండదు. పరశురామక్షేత్రం నేపథ్యంలో జరిగే కథ ఇది. ఏదేమైనా విడుదలకు ముందు ‘అఖండ’తో పోల్చడం సినిమాకు లాభమే అనుకుంటున్నా (నవ్వుతూ).
ఈ సినిమాలో హీరోయిన్ల పాత్రలు కథలో చాలా కీలకంగా ఉంటాయి. వాళ్ల పాత్రలకు ఓ పర్పస్ ఉంటుంది. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా వండర్ అనిపించేలా ఉంటుంది. నా తదుపరి చిత్రాల గురించి చెప్పాలంటే..శ్రీను వైట్లతో చేస్తున్న సినిమా 30శాతం పూర్తయింది. తర్వాత ప్రసాద్గారితో ఓ సినిమా ఉంటుంది. యూవీ క్రియేషన్స్లో కూడా ఓ సినిమా ఉంటుంది.