కరోనా మొదలైనప్పటి నుండి సినిమాల రిలీజ్ విషయంలో గందరగోళం నెలకొంది. ఏ సినిమా థియేటర్లో విడుదల అవుతుంది, ఏ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని చెప్పడం కొంత కష్టంగానే మారింది. అయితే మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కొశీయుమ్’ చిత్రానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి సాగర్ కె చంద్ర తెరకెక్కించిన భీమ్లా నాయక్ చిత్రం కూడా ఓటీటీలోకి వస్తుందని తెగ ప్రచారం నడుస్తుంది.
ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సుముఖంగా ఉన్నారని.. ఇప్పటికే బేరసారాలు జరుగుతున్నాయని రూమర్స్ వచ్చాయి.ఈ నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమాని 2022 జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు.
నిర్మాతలు ఇచ్చిన క్లారిటీతో భీమ్లా నాయక్ చిత్రానికి సంబంధించి జరుగుతున్న పుకార్లకి బ్రేక్ పడింది. చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, పవన్ భార్యగా నిత్యా మీనన్ నటిస్తోంది. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ – రిటైర్డ్ హవల్దార్ మధ్య అహం, ఆత్మ గౌరవం వల్ల ఏర్పడిన పరిణామాల కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.