‘పోరాటాల పురిటిగడ్డ ఈ వరంగల్. భద్రకాళి తల్లి వెలిసిన ప్రాంతం ఇది. సమ్మక్క సారలమ్మ తల్లులు, ములుగు నరసింహస్వామి కూడా ఇక్కడే కొలువుదీరి ఉన్నారు. వరంగల్ కళలకు పుట్టిల్లు. ప్రపంచదేశాలు సైతం కొనియాడే చరిత్ర ఈ ఓరుగల్లుది. ఇక్కడి వెయ్యి స్థంభాల గుడి ఓ అద్భుతం. ఆ భద్రకాళి తల్లే నన్ను ఇక్కడికి పిలిపించింది. ఆ అమ్మ నిర్ణయమే ఇక్కడ జరుగుతున్న ఈ వేడుక. ఇదంతా అమ్మదయ. తెలంగాణ పోరాటయోధులు సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డపై ఈ వేడుక జరగడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకుడు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మాతలు.ఈ నెల 19న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఆదివారం హన్మకొండలో జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు.
“అఖండ’ తర్వాత ఏంటి? అనుకున్నా.. ‘వీరసింహారెడ్డి’ దొరికింది. ఆ తర్వాత ఏంటి? అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ‘భగవంత్ కేసరి’ దొరికాడు. అదంతా ఆ భద్రకాళి తల్లి చలవే. అనిల్ సినిమాలో కామెడీ బాగా ఉంటుంది. ఇందులో మాత్రం కామెడీతో పాటు అన్నీ ఎమోషన్స్ ఉంటాయి. ట్రైలర్లో ఉంది గోరంతే.. అసలు పండగ ముందుంది. దసరాకి ముందు ప్రేక్షకులకు డబుల్ ధమాకానే. శ్రీలీల చిరస్థాయిగా గుర్తుండిపోయే అద్భుతమైన పాత్ర చేసింది. మగాళ్లకు సైతం కన్నీరు తెప్పించేంత భావోద్వేగాలున్న సినిమా ఇది. చివరిగా చెప్పేదొక్కటే అన్ని పరిశ్రమలను గుర్తించినట్టే సినిమా పరిశ్రమను కూడా ప్రభుత్వాలు గుర్తించాలి. అప్పుడే సినిమారంగం నిలబడుతుంది. మానాన్న ప్రతిరూపంగా నన్ను నిలిపిన మీ అందరికీ రుణపడి ఉంటాను’ అంటూ ‘జై తెలంగాణ’ నినాదంతో ప్రసంగాన్ని ముగించారు బాలకృష్ణ. రాజీపడని నిర్మాతలు, అద్భుతమైన సహకారాన్నందించే నటీనటులు, సాంకేతిక నిపుణులు దొరికారనీ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు.
ఈ సినిమాలో నటించడంపట్ల కాజల్ అగర్వాల్ ఆనందం వ్యక్తంచేసింది. శ్రీలీల మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను వరంగల్ పిల్లని. అందుకే శ్రీలీలగా రాలేదు. విజ్జిపాపగా వచ్చాను. ఇది మంచి కథ. చాలా సినిమాలు చేస్తున్నాను. కానీ ఆత్మ ఉన్న పాత్ర ప్రతి సినిమాలో దొరకదు. అలాంటి గొప్ప పాత్ర ఇచ్చారు దర్శకుడు అనిల్. కథ విన్నప్పుడే ఉద్వేగానికి లోనయ్యాను. ఈ పాత్ర ఇచ్చిన డైరెక్టర్గారికి థాంక్స్ చెబితే, అది చిన్న పదం అవుతుంది. ఇందులో కొన్ని సీన్లు ఎంత బ్యూటీఫుల్గా వచ్చాయంటే, షాట్ ఓకే అయ్యాక కూడాఅదే ట్రాన్స్లో ఉండేదాన్ని. నా లైఫ్లో లేని ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో ఇచ్చారు బాలయ్యసార్. ఆయన కలిసి పనిచేయడమే అదృష్టం’ అని ఆనందం వ్యక్తం చేసింది. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులతో పాటు దర్శకులు బాబీ, మలినేని గోపీచంద్, వంశీ పైడిపల్లి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కథానాయికలు కాజల్ అగర్వాల్, శ్రీలీల వేదికపై బతుకమ్మ ఆడి అహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు.