Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం టాలీవుడ్ను కుదిపేస్తున్నది. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. తాజాగా సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై కేసులు నమోదయ్యాయి. ఇమ్మాని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నటులు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినట్లుగా ఆరోపించారు. ఓ టాక్ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నిర్వహించినట్లు ఆయన ఆరోపించారు. టాక్లో బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరించగా.. స్పెషల్ ఎపిసోడ్లో ప్రభాస్, గోపీచంద్ కనిపించారు.
సదరు ప్లాట్ఫామ్ ద్వారా రూ.80లక్షలు కోల్పోయానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫన్88 అనే బెట్టింగ్ యాప్కి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ఆ హీరోలు ప్రమోటింగ్ చేయడంతోనే తాను ఆ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి నష్టపోయినట్లు పేర్కొన్నారు. యాప్ యాక్సెన్ను నిలిపివేయాలని పోలీసులను కోరారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖులు రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అలాగే, యాంకర్స్, యూ ట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేసిన పలువురిని విచారించిన విషయం తెలిసిందే. తాజాగా ముగ్గురు స్టార్ హీరోలపై కేసు నమోదు కావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.